ఆ జట్టుకు అంత సీన్‌ లేదు: హర్భజన్‌

3 Jun, 2019 15:40 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత వన్డే వరల్డ్‌కఫ్‌లో భారత క్రికెట్‌ జట్టును ఓడించే సత్తా పాకిస్తాన్‌కు లేదని వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ పేర్కొన్నాడు. ప్రస్తుత తరుణంలో భారత్‌తో పది మ్యాచ్‌లు ఆడితే పాకిస్తాన్‌ తొమ్మిదిసార్లు ఓడి పోతుందన్నాడు. ‘పాకిస్తాన్‌ జట్టు ఇప్పుడు మెరుగ్గా లేదు. ఆ జట్టుకు అనుభవం కూడా లేదు. గతంలో పాక్‌ జట్లను ఓడించడం కష్టంగా ఉండేది. కానీ ప్రస్తుతం పాక్‌ జట్టును 10 సార్లలో తొమ్మిదిసార్లు భారత్‌ ఓడించగలదు.

ప్రపంచకప్‌లో ఇప్పటిదాకా భారత్‌పై పాక్‌ గెలవలేదు. ఈసారి ఇంకా కష్టం. అయితే భారత్‌పై కూడా ఒత్తిడి ఉంటుంది. పాకిస్తాన్‌పై ఓడితే ఆ ఒత్తిడిని భరించలేం. ప్రజలు వేరే జట్లపై ఓడితే పట్టించుకోరు. కానీ పాకిస్తాన్‌ చేతిలో ఓడితే కనుక వాళ్లు అన్నీ గుర్తుపెట్టుకుంటారు. పాకిస్తాన్‌తో ఓడిన సందర్భాల్లో భారత్‌లో ఏమి జరిగిందనేది నాకు తెలుసు. భారత్‌పై పాక్‌ గెలిస్తే అది వారికి బోనస్‌. ఆ ఓటమి మనకు చాలా చేటు చేస్తుంది’ అని హర్భజన్‌ సింగ్‌ పేర్కొన్నాడు. ఉప ఖండపు జట్లతో భారత్‌కు ఎటువంటి ప్రమాదం లేదని, ఈ వరల్డ్‌కప్‌లో భారత్‌కు గట్టి ప్రత్యర్థి ఎవరైనా ఉన్నారంటే అది ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టేనన్నాడు.

మరిన్ని వార్తలు