ఈ లెక్కన ప్రపంచకప్‌ మాదే : పాక్‌ ఫ్యాన్స్‌

8 Jun, 2019 12:12 IST|Sakshi

లండన్‌ : యాదృశ్చికమో.. కాకతాళీయమో కానీ పాకిస్తాన్‌ జట్టుకు 1992 ప్రపంచకప్‌ టోర్నీ నాటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. అప్పుడు ఈ మెగాటోర్నీ రౌండ్‌రాబిన్‌తో పద్దతిలోనే జరగ్గా.. తాజా ప్రపంచకప్‌ అదే పద్దతిలో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే పాక్‌ జట్టు వెస్టిండీస్‌పై ఘోరపరాజయంతో ప్రారంభించగా.. అప్పుడు కూడా ఇదే వెస్టిండీస్‌పై ఘోర ఓటమిని మూటగట్టుకొని టోర్నీని ఆరంభించింది. రెండో మ్యాచ్‌లో హాట్‌ ఫేవరేట్‌, ఆతిథ్య ఇంగ్లండ్‌ను మట్టికరిపించగా.. 1992లో జింబాంబ్వేపై విజయం సాధించింది. ఇక మూడో మ్యాచ్‌ శ్రీలంకతో శుక్రవారం జరగాల్సిన మ్యాచ్‌ వర్షంతో రద్దవ్వగా.. నాడు ఇంగ్లండ్‌తో జరగాల్సిన మ్యాచ్‌ రద్దైంది. ఇప్పుడు ఇదే అంశాన్ని ప్రస్తవిస్తూ పాక్‌ అభిమానులు సర్ఫరాజ్‌ అహ్మద్‌ సేన 1992 ప్రపంచకప్‌ చరిత్రను రిపీట్‌ చేస్తోందని ఆశల పల్లకిలో ఊగుతున్నారు. ఇక 1992 ప్రపంచకప్‌ టైటిల్‌ను ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యంలోని పాక్‌ సొంతచేసుకున్న విషయం తెలిసిందే. సోషల్‌ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 1992 నాటి పాక్‌ గెలుపు, ఓటములను ప్రస్తావిస్తూ గణంకాలను షేర్‌ చేస్తున్నారు. శ్రీలంకతో మ్యాచ్‌ రద్దవ్వడంతో తెగ ఆనందపడిపోతున్నారు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన నాటి టోర్నీలో పాక్‌ ఓటమితోనే ప్రారంభించి.. వరుస విజయాలతో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ టోర్నీలో భారత్‌తో జరిగిన నాలుగో మ్యాచ్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌ సేన 43 పరుగులతో ఓడింది. కానీ ప్రస్తుతం తమ తదుపరి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఈమ్యాచ్‌ను ఎలాగైనా గెలుస్తామని సర్ఫరాజ్‌ అహ్మద్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

‘మాకు మ్యాచ్‌ ఆడాలని చాలా ఉండే. కానీ దురదృష్టవశాత్తు మ్యాచ్‌ రద్దవ్వడంతో ఏమి చేయలేకపోయాం. ఇంగ్లండ్‌పై విజయానంతరం మంచి ఉత్సాహంతో ఉన్నాం కానీ మ్యాచ్‌ ఆడలేకపోయాం. ఆస్ట్రేలియాతో జరిగే తదుపరిలో మ్యాచ్‌లో విజయం సాధిస్తాం.’  అని శ్రీలంకతో మ్యాచ్‌ రద్దు అనంతరం సర్ఫరాజ్‌ పేర్కొన్నాడు. ఇక అభిమానులు మాత్రం ఆస్ట్రేలియాతో జరిగే నాలుగో మ్యాచ్‌, భారత్‌తో జరిగే ఐదో మ్యాచ్‌ పాక్‌ ఓడాలని కోరుకుంటున్నారు. ఆ రెండు కూడా ఓడితే 1992 ప్రపంచకప్‌ పరిస్థితులు పునరావృతం అవుతాయిని, తదుపరి మ్యాచ్‌లు వరుసగా గెలిచి ప్రపంచకప్‌ సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు