పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఓపెనర్ అహ్మద్ షెహజాద్ డోప్ టెస్టులో విఫలమయ్యాడు. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన పాకిస్తాన్ కప్ వన్డే టోర్నీ సందర్భంగా సేకరించిన శాంపుల్స్లో అతను డోపింగ్కు పాల్పడినట్లు నిర్ధారణ అయింది. దీంతో పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) షెహజాద్పై విచారణకు ఆదేశించింది.
ప్రత్యేక కమిటీ ముందు అతను విచారణకు హాజరుకానున్నాడు. పాకిస్తాన్ తరఫున 13 టెస్టులు, 81 వన్డేలు, 57 టి20లు ఆడిన షెహజాద్పై కనిష్టంగా 3 నెలలు... గరిష్టంగా 6 నెలలు సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉంది. ప్రాథమిక పరీక్షలో షెహజాద్ డోపింగ్కు పాల్పడినట్లు రుజువైందని... పూర్తి స్థాయి విచారణ అనంతరం అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు బోర్డు అధికారి తెలిపారు.