అబుదాబి: ఈ ఏడాది నాలుగో టెస్టు విజయం దిశగా పాకిస్తాన్ జట్టు సాగుతోంది. న్యూజిలాండ్తో జరుగుతోన్న తొలి టెస్టులో 176 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలో దిగిన పాకిస్తాన్... ఆదివారం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. చేతిలో 10 వికెట్లు ఉన్న పాక్ విజయానికి మరో 139 పరుగుల దూరంలో ఉంది.
ఇమాముల్ హఖ్ (25 బ్యాటింగ్; 4 ఫోర్లు), హఫీజ్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 56/1తో మూడోరోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ హసన్ అలీ (5/45), యాసిర్ షా (5/110) విజృంభణతో 249 పరుగులకు ఆలౌటైంది. నికోల్స్ (55; 3 ఫోర్లు), వాట్లింగ్ (59; 5 ఫోర్లు) అర్ధశతకాలు సాధించారు. వీరిద్దరూ ఐదో వికెట్కు 112 పరుగులు జతచేశారు. ఈ దశలో పాక్ బౌలర్లు చెలరేగడంతో 29 పరుగుల వ్యవధిలో కివీస్ చివరి 6 వికెట్లు కోల్పోయింది.