విజయంతో ముగించిన పాక్‌

8 Feb, 2019 02:15 IST|Sakshi

చివరి టి20లో దక్షిణాఫ్రికా ఓటమి

సెంచూరియన్‌:  దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు, వన్డే, టి20 సిరీస్‌లను కోల్పోయిన పాకిస్తాన్‌కు చివరి మ్యాచ్‌లో ఊరట విజయం లభించింది. బుధవారం జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో పాక్‌ 27 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గిన సఫారీలు 2–1తో సిరీస్‌ను సొంతం చేసుకున్నారు. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఎవరూ భారీ స్కోరు సాధించకపోయినా... రిజ్వాన్‌ (26), ఆసిఫ్‌ అలీ (25), షాదాబ్‌ ఖాన్‌ (22 నాటౌట్‌) తలా ఓ చేయి వేశారు. బ్యూరాన్‌ హెం డ్రిక్స్‌ (4/14) అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశాడు.

అనంతరం దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులు చేసింది. క్రిస్‌ మోరిస్‌ (29 బంతుల్లో 55 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించగా, వాన్‌ డర్‌ డసెన్‌ (35 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆమిర్‌కు 3 వికెట్లు దక్కాయి. బ్యాటింగ్‌లో చివరి ఓవర్లో మూడు భారీ సిక్సర్లు బాదడంతో పాటు 2 కీలక వికెట్లు తీసిన షాదాబ్‌ ఖాన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కగా, డేవిడ్‌ మిల్లర్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా ఎంపికయ్యాడు.

>
మరిన్ని వార్తలు