ఓవరాల్‌ చాంప్‌ పంజాబ్‌ యూనివర్సిటీ 

2 Mar, 2020 01:53 IST|Sakshi

ముగిసిన ఖేలో ఇండియా గేమ్స్‌ 

భువనేశ్వర్‌: తొలిసారి నిర్వహించిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో పంజాబ్‌ యూనివర్సిటీ జట్టు ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం ముగిసిన ఈ క్రీడల్లో పంజాబ్‌ వర్సిటీ మొత్తం 46 పతకాలు సాధించింది. ఇందులో 17 స్వర్ణాలు, 19 రజతాలు, 10 కాంస్యాలు ఉన్నాయి. ముగింపు ఉత్సవానికి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్, కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. మొత్తం పది రోజులపాటు జరిగిన ఈ క్రీడల్లో 64 యూనివర్సిటీలు కనీసం ఒక స్వర్ణమైనా సాధించాయి. 113 యూనివర్సిటీలు కనీసం ఒక కాంస్యమైనా గెలిచాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నాలుగు పతకాలతో (స్వర్ణం, రజతం, రెండు కాంస్యాలు) 38వ ర్యాంక్‌లో... ఆంధ్ర యూనివర్సిటీ రెండు పతకాలతో (స్వర్ణం, కాంస్యం) 50వ ర్యాంక్‌లో... కృష్ణా యూనివర్సిటీ రెండు రజతాలతో 72వ ర్యాంక్‌లో... డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ ఒక కాంస్యంతో 97వ ర్యాంక్‌లో.... తెలంగాణకు చెందిన ఉస్మానియా యూనివర్సిటీ రెండు పతకాలతో (స్వర్ణం, రజతం) 45వ ర్యాంక్‌లో... పాలమూరు యూనివర్సిటీ ఒక రజతంతో 81వ ర్యాంక్‌లో నిలిచాయి.

మరిన్ని వార్తలు