అద్వానీ అదరహో

16 Nov, 2018 01:38 IST|Sakshi

బిలియర్డ్స్‌ 150 అప్‌ ఫార్మాట్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్‌ సొంతం

కెరీర్‌లో 20వ ప్రపంచ టైటిల్‌  

యాంగన్‌ (మయన్మార్‌): అంతర్జాతీయ వేదికపై భారత క్యూ స్పోర్ట్స్‌ (బిలియర్డ్స్, స్నూకర్‌) స్టార్‌ ప్లేయర్‌ పంకజ్‌ అద్వానీ మరోసారి తన సత్తా చాటుకున్నాడు. అంతర్జాతీయ బిలియర్డ్స్, స్నూకర్‌ సమాఖ్య (ఐబీఎస్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ బిలియర్డ్స్‌ 150 అప్‌ పాయింట్ల ఫార్మాట్‌ చాంపియన్‌షిప్‌లో పంకజ్‌ అద్వానీ విజేతగా నిలిచాడు. గురువారం జరిగిన ఫైనల్లో బెంగళూరుకు చెందిన 33 ఏళ్ల పంకజ్‌ 6–2 (150–21, 0–151, 151–0, 4–151, 151–11, 150–81, 151–109, 151–0) ఫ్రేమ్‌ల తేడాతో నే థ్వె ఓ (మయన్మార్‌)పై విజయం సాధించాడు.

లీగ్‌ దశలో తన ప్రత్యర్థులకు ఒక్క ఫ్రేమ్‌ కోల్పోకుండా గ్రూప్‌ టాపర్‌గా నిలిచిన పంకజ్‌ అదే జోరును నాకౌట్‌ మ్యాచ్‌ల్లోనూ కొనసాగించి విజయాన్ని దక్కించుకున్నాడు. పాయింట్ల ఫార్మాట్‌లో పంకజ్‌దికి వరుసగా మూడో ప్రపంచ టైటిల్‌ కావడం విశేషం. 2016లో బెంగళూరులో, 2017లో దోహాలో జరిగిన మెగా ఈవెంట్స్‌లోనూ అతను టైటిల్స్‌ గెలిచాడు.   

మరిన్ని వార్తలు