‘పంత్‌.. వారి నోటికి తాళం వేయి’

27 Jan, 2020 11:54 IST|Sakshi

చెన్నై: టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ ప్రదర్శనపై వస్తున్న విమర్శలకు అతను ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతేనే మంచిదని దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ అభిప్రాయపడ్డాడు. తన ఆట తీరుపై ఎవరూ విమర్శలు చేసినా వారికి తిరిగి నోటితో సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు. రిషభ్‌కు సమయం వచ్చినప్పుడు బ్యాట్‌తోనే అందుకు బదులిస్తే బాగుంటుందన్నాడు. ‘ రిషభ్‌.. నీపై వస్తున్న విమర్శలపై కౌంటర్‌ ఎటాక్ చేయాల్సిన అవసరం లేదు. వారి మాటలు తప్పని బ్యాట్‌తోనే సమాధానం ఇవ్వు.  విమర్శకుల నోటికి బ్యాట్‌తోనే తాళం వేయి. అంతవరకూ నిరీక్షించు.. కానీ విమర్శలకు దిగవద్దు. పంత్‌ ఒక టాలెంట్‌ ఉన్నక్రికెటర్‌. ఇప్పుడు అతని కెరీర్‌ను గాడిలో పెట్టుకోవడంపైనే దృష్టి పెట్టాలి. 

అంతేకానీ విమర్శలకు ప్రతి విమర్శ వద్దు. నీ సమయం వచ్చినప్పుడు బ్యాట్‌తో సమాధానం చెప్పు’ అని కపిల్‌ పేర్కొన్నాడు. శనివారం చెన్నైలోని ఓ ప్రొమోషనల్‌ ఈవెంట్‌కు హాజరైన కపిల్‌..రిషభ్‌ పంత్‌ ఒక నైపుణ్యం ఉన్న ఆటగాడన్నాడు. ‘నీలో టాలెంట్‌ ఉంటే ఇక ఎదుటివారిపై విమర్శలు ఎందుకు. టాలెంట్‌ ఉన్న ప్రతీ ఒక్కరూ వారి ప్రతిభతోనే విమర్శకుల నోళ్లకు తాళం వేస్తారు. అదే వారి పని. అంతే కానీ విమర్శలపై తిరిగి విమర్శలు చేయడం మంచిది కాదు’ అని కపిల్‌ పేర్కొన్నాడు.  ఇక ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో గాయం కారణంగా రిషభ్‌ దూరం కాగా, ఆ స్థానాన్ని కేఎల్‌ రాహుల్‌ భర్తీ చేశాడు. (ఇక్కడ చదవండిపంత్‌ మొహం మొత్తేశాడా?)

అటు తర్వాత రిషభ్‌ గాయం నుంచి కోలుకున్నా రాహుల్‌నే కీపర్‌గా కొనసాగిస్తూ వస్తోంది టీమిండియా మేనేజ్‌మెంట్‌. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో కూడా రాహుల్‌నే కీపర్‌గా తుది జట్టులోకి తీసుకుంటున్నారు. దాంతో రిషభ్ పంత్‌తో పాటు సంజూ శాంసన్‌లు రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమవుతున్నారు. కాగా, దీనిపై కపిల్‌ను అడగ్గా.. అది టీమిండియా మేనేజ్‌మెంట్‌ నిర్ణయమన్నాడు. దాని గురించి తనకు తెలీయదన్నాడు. అది తాను డిసైడ్‌ చేసేది కాదని, ఎవర్నీ ఎలా పంపాలో మేనేజ్‌మెంట్‌ చూసుకుంటుందని కపిల్‌ తెలిపాడు. 

మరిన్ని వార్తలు