రాజ్కోట్: ఒకవైపు పేలవమైన ఆటతో విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్.. ఆస్ట్రేలియాతో రాజ్కోట్ వేదికగా జరగబోయే రెండో వన్డేకు గాయం కారణంగా దూరమయ్యాడు. ముంబైలో ఆసీస్తో జరిగిన తొలి వన్డేలో పంత్ తలకు గాయం కావడంతో అతను రెండో వన్డేకు దూరం అవుతున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఓ ప్రకటనలో వెల్లడించింది. మొదటి వన్డేలో ఆసీస్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్ వేసిన బౌన్సర్కు గాయపడ్డ పంత్.. ఆ తర్వాత కీపింగ్కు రాలేదు. ((ఇక్కడ చదవండి: పది వికెట్ల పరాభవం)
దాంతో కేఎల్ రాహుల్ కీపర్ బాధ్యతలు నిర్వర్తించాడు. అతన్ని వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందించారు. ప్రస్తుతం రిషభ్ పంత్ బెంగళూరులో నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) పునరావస శిబిరంలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సిరీస్కు మొత్తం దూరం అవుతాడా.. మూడో వన్డే నాటికి పంత్ సిద్ధమవుతాడా అనే విషయం తెలియాల్సి ఉంది. తొలి వన్డేలో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. భారత్ నిర్దేశించిన 256 పరుగుల టార్గెట్ను ఆసీస్ వికెట్ కోల్పోకుండా ఛేదించింది. వార్నర్-ఫించ్లు తలో సెంచరీతో ఆసీస్కు భారీ విజయాన్ని అందించారు. (ఇక్కడ చదవండి: కోహ్లి కాల్ కోసం ఎదురుచూస్తున్నా: వార్నర్)