పంత్‌పై యువరాజ్‌ ప్రశంసల జల్లు

25 Mar, 2019 11:53 IST|Sakshi
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న యువరాజ్‌ సింగ్‌

సాక్షి, ముంబై: రిషభ్‌ పంత్‌ ఎదగడానికి ఎక్కువ అవకాశాలివ్వాలని, అతడు భారత క్రికెట్‌ భవిష్యత్‌ ఆశాకిరణమని ముంబై ఇండియన్స్‌ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ అన్నారు. ఐపీఎల్‌లో ఆదివారం జరిగినన ముంబై ఇండియన్స్‌-ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌లో ఢిల్లీ ఆటగాడు రిషభ్‌ పంత్‌ 27 బంతుల్లో 78 పరుగులు చేసి మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో యువరాజ్‌ మాట్లాడుతూ.. పంత్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘పంత్‌లో అద్భుత ప్రతిభ దాగుంది. ఎదిగేందుకు సరైన అవకాశాలిస్తే అతడు భారత క్రికెట్‌కు ఫ్యూచర్‌ స్టార్‌ అవుతాడ’ని యువీ అన్నారు. ప్రపంచ కప్‌ ఎంపిక గురించి తాను చెప్పలేనని, కానీ పంత్‌ ప్రస్తుత ప్రదర్శన మాత్రం సూపర్గా ఉందని యువీ పేర్కొన్నారు. 21 ఏళ్ల వయసులో విదేశాల్లో రెండు శతకాలు బాదడం పంత్‌ టాలెంట్‌కు నిదర్శనమని 2011 ప్రపంచకప్‌ హీరో యువరాజ్‌ ప్రశంసించారు.

ఈ ఐపీఎల్‌ సీజన్‌ తొలి మ్యాచ్‌లో ముంబై ఓటమిపై స్పందించిన యువీ..  రోహిత్‌ శర్మ త్వరగా ఔటవడం తమ అవకాశాల్ని దెబ్బతీసిందని.. డికాక్‌, పొలార్డ్‌లు తమకు లభించిన ఆరంభాల్ని పెద్ద స్కోర్లుగా మలచలేకపోయారని, సరైన భాగస్వామ్యాల్ని నెలకొల్పలేకపోవడంతో 215 పరుగల భారీ స్కోరును చేధించడం తమకు కష్టమైపోయిందని విశ్లేషించాడు. ఈ మ్యాచ్‌లో 35 బంతుల్లో 53 పరుగులతో యువరాజ్‌ చివరిదాకా పోరాడాడు. కానీ అతడికి మిగతా బ్యాట్స్‌మెన్‌ల మద్దతు కరువవడంతో ముంబై చేధనలో ఓడిపోయింది. 

అతడు మా గెలుపు గుర్రం: ఢిల్లీ ఓపెనర్‌ కొలిన్‌ ఇంగ్రామ్‌
‘గత ఐపీఎల్‌ సీజన్‌లో అదరగొట్టిన రిషభ్‌ పంత్‌ అదే ఫామ్‌ను కొనసాగిస్తూ ముంబైపై మ్యాచ్‌లో బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడటం సంతోషం. తనదైన రోజున పంత్‌ మ్యాచ్‌ను ప్రత్యర్థి నుంచి సులువుగా లాక్కుంటాడు. శిఖర్‌ ధావన్‌తో నేను నెలకొల్పిన 83 పరుగుల భాగస్వామ్యం జట్టు భారీ స్కోరుకు బాటలు వేసింది. టీ20ల్లో త్వరగా వికెట్లు చేజార్చుకుంటే ఎక్కువ పరుగులు చేయడం కష్టం. వరల్డ్‌కప్‌ సన్నాహకాల నేపథ్యంలో నేను ఐపీఎల్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. ఈలోపు మిగతా క్రికెటర్లతో తక్కువ సమయంలో సాన్నిహిత్యం పెంచుకుంటే సమష్టిగా రాణించి జట్టుకు ఎక్కువ విజయాలు దక్కుతాయ’ని ఢిల్లీ ఓపెనర్‌ కొలిన్‌ ఇంగ్రామ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. 

మరిన్ని వార్తలు