టీ20లో సరికొత్త రికార్డు

29 Sep, 2019 11:20 IST|Sakshi

సింగపూర్‌: అంతర్జాతీ టీ20 చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా సింగపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌ కెప్టెన్‌ పరాస్‌ ఖడ్కా శతకంతో చెలరేగాడు. దాంతో  అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో ఛేజింగ్‌లో సెంచరీ నమోదు చేసిన తొలి కెప్టెన్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. సింగపూర్‌ నిర్దేశించిన 152 పరుగుల లక్ష్య ఛేదనలో నేపాల్‌ ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. 16 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. ఇక్కడ నేపాల్‌ కెప్టెన్‌ పరాస్‌ 52 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో అజేయంగా 106 పరుగులు చేశాడు.

ఫలితంగా నేపాల్‌ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో తొలి సెంచరీ సాధించిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సాధించాడు. అదే సమయంలో అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో ఛేజింగ్‌లో సెంచరీ నమోదు చేసిన తొలి కెప్టెన్‌గా రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. మరొకవైపు 49 బంతుల్లోనే సెంచరీ సాధించి వేగవంతంగా ఈ ఫీట్‌ సాధించిన నాల్గో ఆసియా కెప్టెన్‌గా నిలిచాడు.

శనివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సింగపూర్‌ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. సింగపూర్‌ కెప్టెన్‌ టిమ్‌ డేవిడ్‌(64 నాటౌట్‌) రాణించగా, సురేంద్రన్‌ చంద్రమోహన్‌(35) ఫర్వాలేదనిపించాడు. ఆపై లక్ష్య ఛేదనలో నేపాల్‌ ఆదిలోనే ఇషాన్‌ పాండే(5) వికెట్‌ను కోల్పోయింది. అటు తర్వాత పరాస్‌- ఆరిఫ్‌ షేక్‌లు మరో వికెట్‌ పడకుండా నేపాల్‌కు విజయాన్ని అందించారు. ఈ జోడి 145 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో నేపాల్‌ సునాయాసంగా విజయాన్ని అందుకుంది.

>
మరిన్ని వార్తలు