డీన్‌ జోన్స్‌కు పార్థీవ్‌ అదిరిపోయే పంచ్‌

19 Nov, 2019 10:27 IST|Sakshi

బెంగళూరు: వచ్చే ఏడాది జరుగనున్న ఐపీఎల్‌లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు పార్థీవ్‌ పటేల్‌ను జట్టుతో పాటే ఉంచుకుంది. గత సీజన్‌లో పార్థీవ్‌ పటేల్‌ మెరుగైన ప్రదర్శన చేయడంతో పార్థీవ్‌నే అట్టిపెట్టుకుంది. 2019 సీజన్‌లో పార్థీవ్‌ పలు మంచి ఇన్నింగ్స్‌లు ఆడి 373 పరుగులు చేశాడు. దాంతో పార్థీవ్‌పై మరొకసారి నమ్మకం ఉంచింది ఆర్సీబీ యాజమాన్యం. కాగా, పార్థీవ్‌ను తిరిగి జట్టులో కొనసాగించడంపై ఆసీస్‌ మాజీ క్రికెటర్‌, క్రికెట్‌ విశ్లేషకుడు డీన్‌ జోన్స్‌ వ్యంగ్యంగా స్పందించాడు. ‘ పార్థీవ్‌ను అట్టిపెట్టుకున్నారా. అసలు ఆర్సీబీ క్రికెట్‌ ఆపరేషన్స్‌ డైరక్టర్‌ ఎవరు? అని ట్వీట్‌ చేశాడు.

దాంతో చిర్రెత్తుకొచ్చిన పార్థీవ్‌ పటేల్‌ కాస్త ఘాటుగానే బదులిచ్చాడు. ‘ మీరు ప్రశాంతంగా ఉంటే మంచిది. వచ్చే ఐపీఎల్‌లో మీ సెలక్ట్‌ డగౌట్‌లో కూర్చుని మ్యాచ్‌లు చూస్తే బాగుంటుంది’ అని పేర్కొన్నాడు. ఇది కాస్తా వైరల్‌గా మారింది. 2018లో తిరిగి ఆర్సీబీ జట్టులోకి వచ్చినప్పట్నుంచీ పార్ధీవ్‌ తుది జట్టులో చోటుకు ఎటువంటి ఢోకా ఉండటం లేదు. వికెట్‌ కీపరే కాకుండా ఓపెనర్‌ కూడా కావడంతో పార్థీవ్‌ ఆర్సీబీ ఎలెవన్‌లో చోటు దక్కించుకుంటూ వస్తున్నాడు. 2014లో ఆర్సీబీ తరఫున పార్థీవ్‌ ఆడాడు. ఇక చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లకు కూడా పార్థీవ్‌ ఆడాడు. తన ఐపీఎల్‌ కెరీర్‌లో 139 మ్యాచ్‌లు ఆడిన పార్థీవ్‌ 22.60 సగటుతో 2,848 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 13 హాఫ్‌ సెంచరీలు చేయగా, అత్యధిక వ్యక్తిగత స్కోరు 81.

>
మరిన్ని వార్తలు