హాంకాంగ్ ఓపెన్ టోర్నీ
కౌలూన్ (హాంకాంగ్): కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ పారుపల్లి కశ్యప్ హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో కశ్యప్ 21–7, 12–21, 21–18తో టాప్ సీడ్ సు జెన్ హావో (చైనీస్ తైపీ)పై గెలుపొందాడు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో ఇస్కందర్ జుల్కర్నైన్ (మలేసియా) నుంచి కశ్యప్నకు వాకోవర్ లభించింది. మరోవైపు మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప (భారత్) జంట 21–16, 19–21, 21–14తో వాంగ్చి లిన్–లి చియా సిన్ (చైనీస్ తైపీ) ద్వయంపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
నేడు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ల్లో సుపన్యు అవింగ్సనోన్ (థాయ్లాండ్)తో సమీర్ వర్మ; ఖోసిత్ ఫెత్రాదబ్ (థాయ్లాండ్)తో సాయిప్రణీత్; వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)తో కిడాంబి శ్రీకాంత్; ఆండర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో ప్రణయ్; ఆంథోని గిన్టింగ్ (ఇండోనేసియా)తో కశ్యప్ తలపడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో అకానె యామగుచి (జపాన్)తో సైనా నెహ్వాల్; నిచావోన్ జిందాపోల్ (థాయ్లాండ్)తో పీవీ సింధు ఆడతారు.