మా ఓటమికి అతడే కారణం: కమిన్స్‌

7 Mar, 2019 10:57 IST|Sakshi

నాగ్‌పూర్‌: భారత్‌తో జరిగిన రెండో వన్డేలో తాము ఓటమి చెందడానికి ప్రధాన కారణం విరాట్‌ కోహ్లినేనని ఆస్ట్రేలియా పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ తెలిపాడు. విరాట్‌ కోహ్లి అద్భుతమైన ఇన్నింగ్స్‌తోనే తమను పరాజయం వెక్కిరించిందని పేర్కొన్నాడు.  టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చేసిన 116 పరుగులే రెండు జట్ల మధ్య ప్రధాన తేడాగా కమిన్స్‌ అభిప్రాయపడ్డాడు.  అతడు చాలా బంతులు ఎదుర్కొన్నాడని, నాణ్యమైన షాట్లు ఆడాడని పేర్కొన్నాడు.

‘మేం మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాం. స్టోయినిస్‌ అర్ధశతకం చేశాడు. శుభారంభమే లభించింది. గెలిపించే ఆటగాడు మాత్రం మాకు దొరకలేదు. టీమిండియాకు మాత్రం విరాట్‌ ఉన్నాడు. చాలా బంతులు ఎదుర్కొన్నాడు. రెండు జట్లకు అతడే తేడా. అవకాశం లేని చోట జట్టు స్కోరును 250కి తీసుకెళ్లాడు. అతడికి మేం అద్భుతమైన బంతులు వేశాం. అతడు స్పిన్‌ను ఎదుర్కొన్న తీరు ఈ వికెట్‌పై మాకైతే కష్టమే. ఆటపై పూర్తి పట్టున్న వ్యక్తి అతడే. మాకు విరాట్‌ తరహా ఆటగాడు లేకపోవడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది’ అని  కమిన్స్‌ తెలిపాడు. ఆ మ్యాచ్‌లో తన ప్రదర్శన పట్ల కమిన్స్‌ సంతోషం వ్యక్తం చేశాడు. భారత్‌పై నాలుగు  వికెట్లు సాధించడంతో తన ఫామ్‌ను తిరిగి అందిపుచ్చుకున్నానన్నాడు.

మరిన్ని వార్తలు