‘జూనియర్‌ మలింగా’ వరల్డ్‌ రికార్డు

20 Jan, 2020 15:59 IST|Sakshi

బ్లోమ్‌ఫొంటెన్‌: సుమారు నాలుగు నెలల క్రితం శ్రీలంక కాలేజ్‌ క్రికెట్‌ స్థాయిలో ఎక్కువగా వినిపించిన పేరు మతీషా పతిరాణా. అచ్చం లసిత్‌ మలింగా తరహా యాక్షన్‌ను పోలి ఉండే పతిరాణా.. ఇప్పుడు అండర్‌-19 క్రికెట్‌ ఆడేస్తున్నాడు. గతేడాది సెప్టెంబర్‌లో ఒక కాలేజ్‌ మ్యాచ్‌లో పతిరాణా ఏడు పరుగులిచ్చి ఆరు వికెట్లు సాధించాడు. ప్రధానంగా యార్కర్లేనే తన ఆయుధంగా చేసుకుని బ్యాట్స్‌మెన్‌కు వణుకుపుట్టించాడు. ఆ ప్రదర్శనే ఇప్పుడు పతిరాణా అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఆడటానికి కారణమైంది.

అయితే ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పతిరాణా వికెట్‌ సాధించకపోయినప్పటికీ ఒక వరల్డ్‌ రికార్డును మాత్రం లిఖించాడు. పాకిస్తాన్‌ మాజీ పేసర్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పిలవబడే షోయబ్‌ అక్తర్‌ ఫాస్టెస్ట్‌ బాల్‌ రికార్డును పతిరాణా బ్రేక్‌ చేశాడు. నిన్నటి మ్యాచ్‌లో పతిరాణా 175 కి.మీ వేగంతో బంతిని సంధించి కొత్త వరల్డ్‌ రికార్డును నెలకొల్పాడు. అంతర్జాతీయ  క్రికెట్‌లో ఏ స్థాయిలోనైనా ఇదే ఫాస్టెస్ట్‌ బాల్‌. భారత్‌ ఇన్నింగ్స్‌ నాల్గో ఓవర్‌లో యశస్వి జైశ్వాల్‌ బ్యాటింగ్‌ చేస్తున్న క్రమంలో సంధించిన బంతి రికార్డు పుస్తకాల్లో లిఖించబడింది. అయితే ఆ బంతి వైడ్‌ బాల్‌ కావడంతో ఎక్స్‌ట్రా రూపంలో భారత్‌కు పరుగు వచ్చింది. 2003 వరల్డ్‌కప్‌లో షోయబ్‌ అక్తర్‌ 161.3కి.మీ వేగంతో వేసిన బంతి ఫాస్టెస్ట్‌ బాల్‌గా ఇప్పటివరకూ ఉండగా దాన్ని పతిరాణా బ్రేక్‌ చేశాడు. (ఇక్కడ చదవండి: యువ భారత్‌ శుభారంభం)

మరిన్ని వార్తలు