ప్రదీప్‌ ప్రతాపం

7 Oct, 2019 03:56 IST|Sakshi

36 పాయింట్లతో చెలరేగిన పట్నా రైడర్‌

బెంగాల్‌పై పైరేట్స్‌ విజయం

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌–7  

గ్రేటర్‌ నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో పట్నా పైరేట్స్‌ రైడర్‌ ప్రదీప్‌ నర్వాల్‌ మరోసారి విశ్వరూపం ప్రదర్శించాడు. ఏకంగా 36 పాయింట్లు సాధించాడు. దీంతో పట్నా 69–41తో బెంగాల్‌ వారియర్స్‌పై ఘన విజయం సాధించింది. అతడికి జాంగ్‌ కున్‌ లీ (8 పాయింట్లు), ట్యాక్లింగ్‌లో నీరజ్‌ కుమార్‌ (5 పాయింట్లు) చక్కని సహకారం అందించారు.  ఆట మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా రైడ్‌కు వెళ్లిన ప్రదీప్‌... ఏకంగా ఆరుగురిని ఔట్‌ చేసి రైడింగ్‌లో తనకు ఎదురులేదని చాటాడు.

ఈ మ్యాచ్‌లో పట్నా ప్రత్యరి్థని నాలుగు సార్లు ఆలౌట్‌ చేయడం విశేషం. బెంగాల్‌ తరఫున సౌరభ్‌ (11 పాయింట్లు), రాకేశ్‌ (10 పాయిం ట్లు) ఆకట్టుకున్నారు. ఈ సీజన్‌లో 300 పాయింట్ల మార్కును అందుకున్న రెండో రైడర్‌గా ప్రదీప్‌ (304 పాయింట్లు) నిలిచాడు. బెంగళూరు రైడర్‌ పవన్‌ షెరావత్‌ 309 పాయింట్లతో ముందున్నాడు. మరో మ్యాచ్‌లో యూపీ యోధ 43–39తో పుణేరి పల్టన్‌పై గెలిచింది. నేటి మ్యాచ్‌ల్లో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌తో తెలుగు టైటాన్స్‌; తమిళ్‌ తలైవాస్‌తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ తలపడతాయి.  

మరిన్ని వార్తలు