క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మాజీ సారథి

14 Sep, 2018 14:32 IST|Sakshi

లండన్‌‌: ఇంగ్లండ్‌ మూడు సార్లు యాషెస్‌ సిరీస్‌ గెలిచింది ఆతడి సారథ్యంలోనే.. టీ20 ప్రపంచకప్‌ ముద్దాడింది కూడా ఆయన కెప్టెన్సీలోనే. 22 ఏళ్ల సుదీర్ఘ కాలం క్రికెట్‌ ఆడిన ఇంగ్లండ్‌ మాజీ సారథి పాల్‌ కాలింగ్‌వుడ్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 2011 ప్రపంచకప్‌ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌ ఆడని కాలింగ్‌ వుడ్‌.. వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చిందంటూ ప్రకటించాడు. 1996లోనే తొలి ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ ఆడిన ఈ ఆల్‌రౌండర్‌.. 2001లో వన్డే (పాకిస్తాన్‌పై), 2003లో టెస్టు(శ్రీలంకపై) అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్‌ తరుపున 68 టెస్టులు, 197 వన్డేలు, 36 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌తోనూ కాలింగ్‌ వుడ్‌కు అనుబంధం వుంది. ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్ల తరుపున ప్రాతినిథ్యం వహించాడు. ఈ దిగ్గజ ఆటగాడి రిటైర్మెంట్‌పై ఇంగ్లండ్‌ మాజీ ఆటగాళ్లు మైకెల్‌ వాన్‌, ఇయాన్‌ బోథమ్‌లు ‘గొప్ప ఆటగాడు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు’అంటూ ట్వీట్‌ చేశారు. 

2011లో కాలింగ్‌ వుడ్‌పై వివాదం
చిన్న తప్పు కాలింగ్‌ వుడ్‌ జీవితాన్నే మార్చేసింది. భారత్‌లో జరిగిన 2011 ప్రపంచకప్‌లో పాల్గొన్న ఇంగ్లండ్‌ జట్టులో అతడు సాధారణ సభ్యుడు. అప్పటికే ఇంగ్లండ్‌ నాన్‌ స్టాప్‌ సిరీస్‌లు ఆడుతూ వచ్చింది. ఆ సందర్భంలో ‘ నాన్‌ స్టాప్‌గా క్రికెట్‌ ఆడుతున్నాము. ఇంటికి వెళ్లక చాలా రోజులయింది. నా  కూతురయితే మ్యాచ్‌ ఓడిపోయి ఇంటికి త్వరగా వచ్చేయండి నాన్న’ అంటుందని కాలింగ్‌వుడ్‌ మీడియాతో పేర్కొన్నాడు. దీంతో ఒక్కసారిగా ఈ ఆటగాడిపై విమర్శల వర్షం కురిసింది. క్రికెట్‌ బోర్టు అతడిని ప్రపంచకప్‌ నుంచి అర్థంతరంగా తప్పించింది. అనంతరం అతనికి జాతీయ జట్టులో చోటు దక్కలేదు.. కౌంటీ క్రికెట్‌లో మాత్రమే ఆడాడు. 
 

మరిన్ని వార్తలు