వారియర్స్‌కు చెన్నై స్మాషర్స్‌ షాక్‌

12 Jan, 2017 01:01 IST|Sakshi
వారియర్స్‌కు చెన్నై స్మాషర్స్‌ షాక్‌

బెంగళూరు: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌–2) పోటీలను చెన్నై స్మాషర్స్‌ జట్టు విజయంతో ముగిం చింది. అవధ్‌ వారియర్స్‌తో బుధవా రం జరిగిన మ్యాచ్‌లో చెన్నై స్మాషర్స్‌ 4–3 పాయింట్ల తేడాతో గెలిచింది. తమ లీగ్‌ మ్యాచ్‌లనూ ముగించుకున్న వారియర్స్‌ జట్టు 21 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా... చెన్నై 17 పాయింట్లతో మూడో స్థానంలో, ముంబై రాకెట్స్‌ 19 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి ఇప్పటికే సెమీఫైనల్‌ బెర్త్‌లను ఖాయం చేసుకున్నాయి. పురుషుల సింగిల్స్‌ తొలి మ్యాచ్‌లో విన్సెంట్‌ వోంగ్‌ వింగ్‌ కీ (వారియర్స్‌) 6–11, 11–9, 12–10తో తనోంగ్‌సక్‌ సేన్‌సోమ్‌బున్‌సుక్‌ (చెన్నై)పై గెలిచాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో క్రిస్‌ అడ్‌కాక్‌–గాబ్రియెలా అడ్‌కాక్‌ (చెన్నై) జంట 11–4, 11–9తో బోదిన్‌ ఇసారా–ప్రజక్తా సావంత్‌ జోడీని ఓడించడంతో స్కోరు 1–1తో సమమైంది.

 ‘ట్రంప్‌’ మ్యాచ్‌గా ఎంపిక చేసుకున్న పురుషుల సింగిల్స్‌ మూడో మ్యా చ్‌లో కశ్యప్‌ (చెన్నై) 11–7, 5–11, 11–7తో ఆదిత్య జోషి (వారియర్స్‌)ను ఓడించడంతో చెన్నై 3–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌లో పీవీ సింధు 11–4, 11–6తో రితూపర్ణ దాస్‌ (వారియర్స్‌)పై నెగ్గడంతో చెన్నై 4–1తో విజయాన్ని ఖరారు చేసుకుంది. పురుషుల డబుల్స్‌ ‘ట్రంప్‌’ మ్యాచ్‌లో గో షెమ్‌–మార్కిస్‌ కిడో జంట 12–10, 11–8తో సుమీత్‌ రెడ్డి–కోల్డింగ్‌ జోడీపై గెలిచినా వారియర్స్‌ తుదకు 3–4తో ఓటమి చవిచూసింది. గురువారం జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఢిల్లీ ఏసర్స్‌తో హైదరాబాద్‌ హంటర్స్‌ తలపడుతుంది. ఈ మ్యాచ్‌ ఫలితం ఆధారంగా నాలుగో సెమీస్‌ బెర్త్‌ ఖరారు అవుతుంది.

మరిన్ని వార్తలు