హంటర్స్‌కు తొలి ఓటమి 

29 Dec, 2018 01:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)లో హైదరాబాద్‌ హంటర్స్‌ జట్టుకు తొలి  ఓటమి ఎదురైంది. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం అవధ్‌ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ హంటర్స్‌ 1–4తో పరాజయం పాలైంది. మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌లో పీవీ సింధు (హైదరాబాద్‌) 13–15, 8–15తో బీవెన్‌ జాంగ్‌ చేతిలో ఓడిపోవడం గమనార్హం. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–క్రిస్టియాన్సన్‌ (అవధ్‌) జోడీ 15–12, 9–15, 15–11తో కిమ్‌ సా రంగ్‌–ఎమ్‌ హై వన్‌ (హైదరాబాద్‌) జంటను ఓడించింది. పురుషుల సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో మార్క్‌ కాల్జూ (హైదరాబాద్‌) 15–10, 7–15, 15–7తో లీ డాంగ్‌ కెయున్‌పై; సన్‌ వాన్‌ హో (అవధ్‌) 15–10, 15–11తో లీ హున్‌పై విజయం సాధించారు.

పురుషుల డబుల్స్‌ మ్యాచ్‌లో ఇసారా–కిమ్‌ సా రంగ్‌ (హైదరాబాద్‌) 15–9, 15–13తో యాంగ్‌ లీ–క్రిస్టియాన్సన్‌ జంటపై గెలిచింది. మరో మ్యాచ్‌లో అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్‌ 4–3తో బెంగళూరు రాప్టర్స్‌పై నెగ్గింది. అహ్మదాబాద్‌ తరఫున మిక్స్‌డ్‌ డబుల్స్‌లోనేలకుర్తి సిక్కి రెడ్డి–సాత్విక్‌ సాయిరాజ్‌ ద్వయం... పురుషుల సింగిల్స్‌లో సౌరభ్‌ వర్మ, మహిళల సింగిల్స్‌లో క్రిస్టీ గిల్మోర్‌ గెలుపొందారు.  శనివారం పుణే వేదికగా జరిగే మ్యాచ్‌ల్లో ముంబై రాకెట్స్‌తో పుణే సెవెన్‌ ఏసెస్‌; ఢిల్లీ డాషర్స్‌తో నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌ తలపడతాయి.    

>
మరిన్ని వార్తలు