సైనాపై సింధు విజయం

2 Jan, 2019 01:23 IST|Sakshi

హైదరాబాద్‌ హంటర్స్‌ చేతిలో నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌ చిత్తు

పుణే: భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు కొత్త ఏడాదిని గొప్ప విజయంతో ప్రారంభించింది. ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)లో భాగంగా సైనా నెహ్వాల్‌ ప్రాతినిధ్యం వహించిన నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌పై సింధు నేతృత్వంలోని హైదరాబాద్‌ హంటర్స్‌ 5–0తో ఘనవిజయం సాధించింది. నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌ ఆడిన గత మూడు మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితమైన సైనా ఈసారి బరిలోకి దిగింది. మూడో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో సింధు 11–15, 15–9, 15–5తో సైనాను ఓడిం చింది. అంతకుముందు తొలి మ్యాచ్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కిమ్‌ హా నా–లియావో మిన్‌ చున్‌ (వారియర్స్‌) ద్వయం 15–8, 15–14తో కిమ్‌ సా రంగ్‌– హై వన్‌ జోడీపై నెగ్గి 1–0తో ముందంజ వేసింది.

వారియర్స్‌ ‘ట్రంప్‌’ మ్యాచ్‌లో లీ హున్‌ 10–15, 15–13, 15–9తో సెన్‌సోమ్‌ బున్‌సుక్‌ను ఓడించడం తో హైదరాబాద్‌ 1–0తో ఆధిక్యంలోకి వచ్చింది. మూడో మ్యాచ్‌లో సైనాపై సింధు నెగ్గడంతో హైదరాబాద్‌ ఆధిక్యం 2–0కు పెరిగింది. తర్వాత తమ ‘ట్రంప్‌’ మ్యాచ్‌లో మార్క్‌ కల్జూ 15–11, 15–14తో తియన్‌ హువె (వారియర్స్‌)పై గెలవడంతో హైదరాబాద్‌ ఆధిక్యం 4–0కు చేరింది. ఐదో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో ఇసారా–కిమ్‌ సా రంగ్‌ ద్వయం 15–10, 12–15, 15–14తో లియావో మిన్‌ చున్‌–యోన్‌ సెంగ్‌ యూ (వారియర్స్‌) జోడీని ఓడించడంతో హైదరాబాద్‌ 5–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. బుధవారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ డాషర్స్‌తో బెంగళూరు రాప్టర్స్‌ ఆడుతుంది. 

మరిన్ని వార్తలు