జనవరిలో పీబీఎల్‌ ఐదో సీజన్‌

14 Nov, 2019 01:54 IST|Sakshi

 విజేత జట్టుకు రూ. 3 కోట్లు ప్రైజ్‌మనీ

న్యూఢిల్లీ: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) ఐదో సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఎనిమిది ఫ్రాంచైజీల మధ్య పోరు వచ్చే జనవరి 20 నుంచి జరుగుతుంది. తొలి దశలో చెన్నై, ఢిల్లీ, లక్నో, బెంగళూరు నగరాల్లో పోటీలు నిర్వహిస్తారు. టైటిల్‌ పోరు ఫిబ్రవరి 9న జరుగుతుంది. భారత స్టార్, ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు సహా ప్రపంచ మేటి షట్లర్లు ఇందులో పాల్గొంటారు. భారత్‌ నుంచి సైనా, శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్, సమీర్, సౌరభ్‌ వర్మ తదితరులు పాల్గొంటారు.

మొత్తం టోర్నీ ప్రైజ్‌మనీ రూ.6 కోట్లు. విజేత జట్టుకు ట్రోఫీతో పాటు రూ. 3 కోట్లు అందజేస్తారు. ‘బ్యాడ్మింటన్‌లో భారత్‌ అనూహ్య ప్రగతిని సాధించింది. పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్ షిప్ సాధించి చరిత్రకెక్కితే... సాయిప్రణీత్‌ కాంస్యంతో 36 ఏళ్ల తర్వాత పురుషుల సింగిల్స్‌లో మరో పతకం సాకారమైంది. ప్రతిభగల షట్లర్లు నిలకడైన ప్రదర్శనతో అంతర్జాతీయ టోర్నీల్లో మెరుస్తున్నారు’ అని భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) అధ్యక్షుడు హిమంత బిశ్వశర్మ అన్నారు. 21 రోజుల పాటు జరిగే ఈవెంట్‌ను ‘స్టార్‌ స్పోర్ట్స్‌’ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఆటగాళ్ల వేలం కార్యక్రమం తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ‘బాయ్‌’ తెలిపింది.   

మరిన్ని వార్తలు