భారత్‌ను అడుక్కోలేం: పాకిస్తాన్‌

17 Oct, 2018 12:13 IST|Sakshi

ఇస్లామాబాద్‌: ద్వైపాక్షిక సిరీస్‌ల విషయంలో భారత్‌ను అడుక్కోలేమని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు నూతన అధ్యక్షుడు ఇషాన్‌ మణి స్పష్టం చేశారు. రెండు దేశాల ముందుకు వస్తేనే ద్వైపాక్షిక సిరీస్‌లు జరుగుతాయని అభిప్రాయపడ్డారు. ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ ఇన్‌ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ప్రజల అభిష్టం మేరకే భారత్‌-పాకిస్తాన్‌ మధ్య క్రికెట్‌ ఒప్పందాలు పునప్రారంభమవుతాయన్నారు.

‘తమ జట్టు ప్రతి ఒక్కరితో ఆడటానికి సిద్దంగా ఉంది. ముఖ్యంగా భారత్‌తో ఆడేందుకు ఉవ్విళ్లూరుంతోంది. మేం అక్కడికి వెళ్లినా.. వారు వచ్చినా ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. భారత అభిమానులు పాక్‌కు.. పాక్‌ అభిమానులు భారత్‌కు సంతోషంగా వెళ్లివస్తారు. ఇంతకు మించి ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగవ్వడానికి మరోదారి లేదు. భారత్‌, పాక్‌ ప్రజలు ఇరు దేశాల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ను చూడటానికి ఆసక్తి కనబరుస్తారు. కానీ రాజకీయ నాయకుల వల్లే సత్సంబంధాలు దెబ్బతిన్నాయి. కానీ భవిష్యత్తులో ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా వారు కూడా ముందుకు వెళ్లలేరు.

ఈ విషయంలో నాటకీయం చోటుచేసుకుంది. అదేంటో ఐసీసీ ఈవెంట్లలో భారత్‌ పాకిస్తాన్‌తో ఆడుతోంది, కానీ ద్వైపాక్షిక సిరీస్‌లు మాత్రం ఆడదు. ఇదే మనం అర్థం చేసుకోవాలి. నేను ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక సిరీస్‌ల కోసం కృషి చేశాను. ఇప్పుడు ఈ విషయంలో జోక్యం చేదలుచుకోలేదు. భారత్‌కు ఆడాలని ఉంటే మాతో ఆడుతారు. లేకుంటే లేదు. అంతేగాని మేం వేళ్లి మాతో ఆడండని అడుక్కోలేం. భారత్‌-పాక్‌ మధ్య మ్యాచ్‌ జరిగితే మంచిదే’ అని చెప్పుకొచ్చారు. భారత్‌-పాక్‌ మధ్య 2013 నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడంలేదన్న విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు