‘మేము రావట్లేదు.. మీరే ఆడుకోండి’

27 Dec, 2019 15:04 IST|Sakshi

కరాచీ:  వరల్డ్‌ ఎలెవన్‌తో మ్యాచ్‌లో భాగంగా పాకిస్తాన్‌ క్రికెటర్లకు ఆసియా ఎలెవన్‌ జట్టులో చోటు కల్పించడానికి బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు(బీసీబీ) మొగ్గుచూపడం లేదనే వార్తల నేపథ్యంలో పీసీబీ క్లారిటీ ఇచ్చింది. తమ ఆటగాళ్లు లేకుండా భారత్‌ ఆటగాళ్లు, బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు కలిసి వరల్డ్‌ ఎలెవన్‌తో మ్యాచ్‌లు ఆడుకున్నప్పటికీ తమకు ఎటువంటి అభ్యంతరం లేదంటూనే మరొకవైపు అసహనం వ్యక్తం చేసింది. ఇలా పాకిస్తాన్‌ క్రికెటర్లను ఆసియా లెవన్‌లో ఆడుకుండా అడ్డుకోవడానికి బీసీసీఐ ప్రధాన కారణమని పీసీబీ మరొకసారి తన అక్కసు వెళ్లగక్కింది. (ఇక్కడ చదవండి: పాక్‌ వద్దు.. భారత్‌ ముద్దు)

బీసీసీఐ కారణంగానే తమ ఆటగాళ్లను ఆసియాకప్‌లో ఆడకుండా అడ్డుకుంటున్నారని వాపోయింది. ఇది కచ్చితంగా తమ ఆటగాళ్లను కించపరచడమే  అవుతుందన్నారు.  ఇక్కడ బీసీసీఐ వాస్తవాలను కప్పిపుచ్చి తమ ఫ్యాన్స్‌ను తప్పుదోవ పట్టించడానికి యత్నించిందని విమర్శించింది. తమకు పీఎస్‌ఎల్‌ ఉన్నందును ఆసియా ఎలెవన్‌ జట్టులో భాగం కావడానికి తమ క్రికెటర్లు ఎవరూ కూడా అంత ఆసక్తిగా లేరని తెలిపింది. ఈ విషయాన్ని ముందుగానే బీసీబీకి తెలిపామన్న పీసీబీ.. ఇది బీసీసీఐ తెరపైకి తీసుకొచ్చిన కొత్త ట్విస్ట్‌ అంటూ విమర్శించింది.

‘వరల్డ్‌ లెవన్‌-ఆసియా ఎలెవన్‌ల మధ్య జరగబోయే రెండు టీ20 మ్యాచ్‌ల సమయంలో మాకు పీఎస్‌ఎల్‌ చివరి దశలో ఉంటుంది. దాంతో మా ఆటగాళ్లు పాల్గొనడం కుదరదు. పీఎస్‌ఎల్‌ తేదీలను మార్చడం కూడా కుదరదు..అలానే వరల్డ్‌ ఎలెవన్‌-ఆసియా ఎలెవన్‌ షెడ్యూల్‌లను కూడా మార్చడం కుదరదు.అటువంటప్పుడు మేము ఆసియా ఎలెవన్‌ జట్టులో ఎలా భాగం ఆవుతాం.  మా క్రికెటర్లంతా పీఎస్‌ఎల్‌తో బిజీగా ఉంటారు. ఈ విషయాన్ని ముందుగానే బీసీబీకి తెలియజేశాం. వారు అంగీకరించారు కూడా.

అయితే మా ఆటగాళ్లు ఆడితే భారత జట్టు నుంచి ఏ ఒక్క ఆటగాడు ఆసియా ఎలెవన్‌లో ఆడటానికి రాబోమని చెప్పడం ఏమిటి. ఇది వాస్తవాన్ని కనుమరుగు చేసి మా ఆటగాళ్లను మా అభిమానుల్ని తప్పుదోవ పట్టించడం కాదా. ఇది బీసీసీఐ ఆడుతున్న డ్రామా’ అని పీసీబీ అధికార ప్రతినిధి ప్రశ్నించారు. బంగ్లాదేశ్‌ వ్యవస్థాపకుడు షేక్‌ ముజిబర్‌ రహ్మాన్‌ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మార్చి నెలలో వరల్డ్‌ లెవన్‌-ఆసియా లెవన్‌ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్‌లను బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డుతో పాటు ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌(ఏసీసీ)లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. తొలి మ్యాచ్‌ మార్చి 16వ తేదీన జరుగనుండగా, రెండో టీ20 మార్చి 20వ తేదీన జరుగనుంది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) అధికారిక హోదాలోనే ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.

ఇక్కడ చదవండి:

‘భారత్‌ కంటే పాకిస్తాన్‌ ఎంతో సురక్షితం’

భారత్‌ సంగతి మీకెందుకు!

మరిన్ని వార్తలు