షోయబ్‌ అక్తర్‌పై ‘పీసీబీ’ పరువు నష్టం కేసు

30 Apr, 2020 10:52 IST|Sakshi

ఉమర్‌ అక్మల్‌ నిషేధంపై అక్తర్‌ వీడియో

పీసీబీ లీగల్‌ అడ్వైజరీపై విమర్శలు

కరాచీ: పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌పై పీసీబీ లీగల్‌ అడ్వైజర్‌ తఫాజ్జుల్‌ రిజ్వి పరువు నష్టం కేసు వేశారు. దాంతో పాటు అక్తర్‌పై క్రిమినల్‌ కేసును కూడా ఫైల్‌ చేశారు. అవినీతి ఆరోపణల్లో భాగంగా పాకిస్తాన్‌ వెటరన్‌ క్రికెటర్‌ ఉమర్‌ అక్మల్‌పై మూడేళ్లు నిషేధం విధించిన సందర్భంలో పీసీబీ లీగల్‌ డిపార్ట్‌మెంట్‌పై అక్తర్‌ అసంబద్ధ వ్యాఖ్యలు చేశాడు. ‌ ఉమర్‌ అక్మల్‌ మూడేళ్ల నిషేధంలో పీసీబీ లీగల్‌ అడ్వైజరీ తీసుకున్న నిర్ణయాలను తప్పుబట్టాడు. దీనిపై ఒక వీడియో కూడా విడుదల చేసి బహిరంగ చర్చకు ఆజ్యం పోశాడు.  అక్తర్‌ వైఖరితో విసుగుచెందిన పీసీబీ లీగల్‌ అడ్వైజర్‌ రిజ్వి పరువు నష్టం కేసును వేశారు. న్యాయపరమైన అంశాలు మాట్లాడేటప్పుడు అక్తర్‌ కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యాఖ్యానిస్తే మంచిదనే సలహా ఇచ్చారు. దీనిపై పీసీబీ కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. అసలు అక్తర్‌ బహిరంగంగా పీసీబీ లీగల్‌ డిపార్ట్‌మెంట్‌తో పాటు తమ అడ్వైజరీపై ఇలా ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించింది. ఇది అక్తర్‌కు సరికాదని మండిపడింది. (తమ్ముడూ... సచిన్, ధోని, కోహ్లిలను చూసి నేర్చుకో)

ఇటీవల ఉమర్‌ అక్మల్‌కు అనుకూలంగా అక్తర్‌ మాట్లాడుతూ తన యూట్యూబ్‌ చానల్‌లో వీడియోను విడుదల చేశారు. ప్రధానంగా మూడేళ్ల నిషేధాన్ని తప్పుబట్టాడు. ఇది పీసీబీ లీగల్‌ అడ్వైజరీ అసమర్థవత వల్లే ఉమర్‌కు మూడేళ్ల శిక్ష పడిందంటూ వ్యాఖ్యానించాడు. అదే సమయంలో రిజ్విపై ఆరోపణలు చేశాడు. చాలా సున్నితమైన అంశాల్లో రిజ్వికి అనుభవం లేదంటూ విమర్శించాడు.  కాగా, ఉమర్‌ అక్మల్‌పై పీసీబీ మూడేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. పీసీబీ అవినీతి నిరోధక విభాగం అతనిపై రెండు నెలలుగా విచారించింది. చివరకు సోమవారం శిక్ష ఖరారు చేసింది. అయితే ఉమర్‌పై నిషేధం విధించడానికి గల స్పష్టమైన కారణాలను పీసీబీ వెల్లడించలేదు. కానీ బోర్డు నియమావళిలోని ఆర్టికల్‌ 2.4.4ను అతిక్రమించినట్లు దర్యాప్తులో తేలడంతో వేటు వేశామని పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది.(అతని కంటే మాలికే బెటర్‌: చహల్)

>
మరిన్ని వార్తలు