పెట్రా స్పోర్ట్స్‌ అకాడమీ డబుల్‌ ధమాకా

18 Jan, 2018 10:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్ప్రింగ్‌ సాకర్‌ టోర్నమెంట్‌లో పెట్రా స్పోర్ట్స్‌ అకాడమీ జట్లు విజేతగా నిలిచాయి. పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో నిర్వహించిన ఈ టోర్నీలో అండర్‌–11, అండర్‌–14 విభాగాల్లో పెట్రా స్పోర్ట్స్‌ అకాడమీ జట్లు గెలుపొందాయి. అండర్‌–14 విభాగంలో జీఆర్‌ఎఫ్‌ఏతో జరిగిన ఫైనల్లో 2–2తో స్కోర్లు సమం కావడంతో పెనాల్టీ షూటౌట్‌ ద్వారా విజేతను ప్రకటించారు. పెనాల్టీ షూటౌట్‌లో పెట్రా స్పోర్ట్స్‌ అకాడమీ జట్టు 3–1తో విజయం సాధించింది.

అంతకుముందు ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌తో జరిగిన సెమీఫైనల్లో కూడా పెట్రా స్పోర్ట్స్‌ అకాడమీ షూటౌట్‌ ద్వారానే 3–1తో గెలుపొందింది. అండర్‌–11 విభాగంలో హైదరాబాద్‌ హాట్‌స్పర్స్‌తో జరిగిన ఫైనల్లో పెట్రా స్పోర్ట్స్‌ అకాడమీ 2–0తో పెనాల్టీ షూటౌట్‌లో గెలిచింది. అంతకుముందు ఆ జట్టు గచ్చి బౌలి గన్నర్స్‌తో జరిగిన సెమీస్‌లో 1–0తో గెలుపొంది ఫైనల్‌కు అర్హత సాధించింది. అండర్‌–11 విభాగంలో వేద్, వివేక్‌; అండర్‌–14 విభాగంలో వరుణ్, సామిక్‌లు బెస్ట్‌ ప్లేయర్స్‌గా ఎంపికయ్యారు. విజేతలకు బ్యాడ్మింటన్‌ జాతీయ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ తల్లి సుబ్బరావమ్మ బహుమతులు అందజేశారు.   


 

మరిన్ని వార్తలు