‘గెలవాలనుకుంటే ఆ ఇదర్దిలో ఒకర్ని తీసేయండి’

2 Jan, 2020 12:25 IST|Sakshi

కేప్‌టౌన్‌:  నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఓటమి పాలైన ఇంగ్లండ్‌ జట్టు.. రెండో టెస్టులో విజయం సాధించాలంటే ఒక పని చేయాలని ఆ దేశ దిగ్గజ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌ సూచించాడు. ప్రధానంగా ఇంగ్లండ్‌ తొలి టెస్టులో ఓటమికి పేసర్లు జేమ్స్‌ అండర్సన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌లను తుది జట్టులో తీసుకోవడమే  కారణమన్నాడు. ప్రతీ టెస్టులో వారిద్దరికీ కచ్చితంగా చోటు కల్పించాలనే యోచన మంచిది కాదన్నాడు. ఈ కారణంగానే సఫారీలతో తొలి టెస్టును కోల్పోవాల్సి వచ్చిందన్నాడు. ఇక రెండో టెస్టులో ఇంగ్లండ్‌ గెలవాలంటే ఆ ఇద్దరిలో ఒకర్ని పక్కకు పెట్టాల్సి ఉందన్నాడు. ఇంగ్లండ్‌ పేస్‌ బౌలింగ్‌ ఎటాక్‌ బాగానే ఉండటంతో అండర్సన్‌, బ్రాడ్‌లలో ఒకరికి విశ్రాంతి ఇవ్వాలన్నాడు. అప్పుడు మరొక నాణ్యమైన స్పిన్నర్‌ను జట్టులో తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నాడు.

ఇదే విషయాన్ని ఇంగ్లండ్‌ క్రిస్‌ సిల్వర్‌వుడ్‌ సైతం పేర్కొన్నాడు. రెండో టెస్టులో బ్రాడ్‌-అండర్సన్‌లలో ఒకరికి విశ్రాంతి ఇస్తామన్నాడు. దాంతో స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఫిట్‌నెస్‌ నిరూపించుకోవడంతో లీచ్‌ తుది జట్టులో ఆడటం దాదాపు ఖాయమైంది.  కాకపోతే రెండో టెస్టులో జోఫ్రా ఆర్చర్‌ ఆడటం అనుమానంగా  ఉంది.  ఒకవేళ ఆర్చర్‌ ఆడకపోతే అండర్సన్‌-బ్రాడ్‌లను యథావిధిగా తుది జట్టులో కొనసాగించవచ్చు. తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 107 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే ఆలౌట్‌ కావడంతో జట్టు ఓటమిపై తీవ్ర ప్రభావం చూపింది.

మరిన్ని వార్తలు