పిమ్రదా డబుల్‌ ధమాకా

31 Aug, 2019 10:11 IST|Sakshi

ఐటీఎఫ్‌ టెన్నిస్‌ టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: రాజా నరసింహారావు స్మారక అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) జూనియర్స్‌ గ్రేడ్‌–4 టోర్నమెంట్‌లో థాయ్‌లాండ్‌ క్రీడాకారిణి పిమ్రదా జటవపోర్నవీట్‌ చాంపియన్‌గా నిలిచింది. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం జరిగిన అండర్‌–18 బాలికల ఫైనల్లో టాప్‌ సీడ్‌ పిమ్రదా 6–1, 6–1తో సందీప్తి సింగ్‌ రావు (భారత్‌)పై గెలుపొందింది. డబుల్స్‌లోనూ పిమ్రదా జోడీ టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. తుదిపోరులో పిమ్రదా–లాన్‌లనా (థాయ్‌లాండ్‌) జంట 6–1, 7–6తో మల్లికా (భారత్‌)–యటావీ చిమ్‌చమ్‌ (థాయ్‌లాండ్‌) ద్వయంపై నెగ్గింది.

బాలుర సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌సీడ్‌ ప్యాట్రన్‌ హన్‌చైకుల్‌ (థాయ్‌లాండ్‌) 5–7, 6–0, 6–2తో అదిత్‌ సిన్హా (అమెరికా)పై గెలుపొందాడు. డబుల్స్‌ తుదిపోరులో నిశాంత్‌ దబాస్‌ (భారత్‌)–తనపట్‌ నిరున్‌డోర్న్‌ (థాయ్‌లాండ్‌) ద్వయం 6–4, 6–3తో ఆర్యన్‌ భాటియా–చిరాగ్‌ దుహాన్‌ జోడీపై నెగ్గింది. ఫైనల్‌ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టెన్నిస్‌ సంఘం కార్యదర్శి అశోక్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.  

మరిన్ని వార్తలు