ఒలింపిక్స్‌ పతకాలు సాధించాలి: మోదీ

6 Sep, 2018 00:59 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన అథ్లెట్లను అభినందించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ... వారిని ఒలింపిక్స్‌ పతకాలపై దృష్టిపెట్టా లని సూచించారు. బుధవారం పతక విజేతలు ప్రధానిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మోదీ వారితో ముచ్చటించారు. ‘ఇక్కడితోనే ఆగిపోవద్దు. ఈ పతకాలు, ప్రశంసలతోనే తృప్తిపడొద్దు. క్రీడల్లో సమున్నత లక్ష్యాలను చేరేవరకు విశ్రమించకండి.

ఒలింపిక్స్‌ పతకాలే మీ లక్ష్యమైతే ఇప్పటి నుంచే కష్టపడండి. పోడియం విజేతలుగా నిలవండి’ అని మోదీ భారత అథ్లెట్లతో అన్నారు. ప్రధాని సూచనల్ని క్రీడాకారులంతా శ్రద్ధగా ఆలకించారు. ఏషియాడ్‌ విజేతల్లో కొందరు కుగ్రామాలకు చెందిన పేదలున్నారు. వీరిని చూసి ప్రధాని మోదీ పులకించిపోయారు. అసలేమాత్రం మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాల నుంచి వచ్చి మట్టిలో మాణిక్యాలుగా ఎదిగిన వారిని ఆయన అభినందించారు. 

మరిన్ని వార్తలు