మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌పై కేసు నమోదు

4 Jun, 2020 20:03 IST|Sakshi

చండీగఢ్‌‌ టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌పై హర్యానాలోని హిసార్‌ జిల్లా హన్సి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. యుజువేంద్ర చహల్‌ను కులం పేరుతో కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా దళిత హక్కుల కార్యకర్త, న్యాయవాది రజత్‌ కల్సాన్‌ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు యూవీపై కేసు నమోదు చేయాలంటూ హన్సీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన యూవీపై ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ చేయాలని పోలీసులను ఒత్తిడి చేశారు. వివరాల్లోకి వెళితే.. రోహిత్‌ శర్మతో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో మాట్లాడుతూ టీమిండియా స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ను సరదాగా కామెంట్‌ చేసే క్రమంలో కులం పేరు వాడటంతో అది కాస్తా వివాదానికి దారి తీసింది. టిక్‌టాక్‌లో చాహల్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి వీడియోలు పోస్ట్‌ చేస్తున్నాడని, వీళ్లకేం పని లేదంటూ వాల్మీకి సమాజాన్ని కించపరిచేలా యువీ వ్యాఖ్యలు చేశాడు.(యువీకి సరికొత్త తలనొప్పి)

దీనిపై సోషల్‌ మీడియాలోనూ పెద్ద దుమారమే రేగింది.ఒక కులాన్ని ఉద్దేశిస్తూ కామెంట్‌ చేస్తావా అంటూ యువీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక కులం పేరుతో యువరాజ్‌ కామెంట్‌ చేయడం నిజంగా సిగ్గు చేటని సోషల్‌ మీడియా హోరెత్తుతోంది. ఏ పరిస్థితుల్లోనైనా మతాన్ని, కులాన్ని, జాతిని, వర్ణాన్ని ఉద్దేశించి మాట్లాడటం అవతలి వాళ్లను కించపరచడమేనంటూ విమర్శలు కురిపించారు. ఈ క్రమంలోనే యువరాజ్‌ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ‘యువరాజ్‌ సింగ్‌ మాఫీ మాంగో’(యువరాజ్‌ క్షమాపణలు చెప్పాలి) పేరుతో ట్విటర్‌లో ట్రెండ్‌ చేస్తున్నారు.(ధోని.. నా హెలికాప్టర్‌ షాట్లు చూడు!)

మరిన్ని వార్తలు