ప్రజ్నేశ్‌ ప్రత్యర్థి రావ్‌నిచ్‌

29 Jun, 2019 09:19 IST|Sakshi
ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌

లండన్‌: భారత టెన్నిస్‌ నంబర్‌వన్‌ సింగిల్స్‌ ప్లేయర్‌ ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌కు వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లో క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. సోమవారం మొదలయ్యే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 17వ ర్యాంకర్, 2016 రన్నరప్‌ మిలోస్‌ రావ్‌నిచ్‌ (కెనడా)తో ప్రజ్నేశ్‌ ఆడతాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్‌ మెయిన్‌ ‘డ్రా’లో తొలిసారి ఆడిన ప్రజ్నేశ్‌ మొదటి రౌండ్‌లోనే వెనుదిరిగాడు. డబుల్స్‌ విభాగంలో భారత్‌ నుంచి దివిజ్‌ శరణ్, రోహన్‌ బోపన్న, లియాండర్‌ పేస్, జీవన్‌ నెడుంజెళియన్, పురవ్‌ రాజా బరిలో ఉన్నారు. 

ఒకే పార్శ్వంలో ఫెడరర్, నాదల్‌ 
పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌), మూడో సీడ్‌ నాదల్‌ (స్పెయిన్‌) ఒకే పార్శ్వంలో ఉన్నారు. ఫలితంగా అంతా సజావుగా సాగితే వీరిద్దరు సెమీఫైనల్లోనే తలపడతారు. మరో పార్శ్వంలో టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ (సెర్బియా) ఉన్నాడు. తొలి రౌండ్‌లో లాయిడ్‌ (దక్షిణాఫ్రికా)తో ఫెడరర్‌; సుగిటా (జపాన్‌)తో నాదల్‌; కోల్‌ష్రైబర్‌ (జర్మనీ)తో జొకోవిచ్‌ ఆడతారు. 

మరిన్ని వార్తలు