జింఖానా, న్యూస్లైన్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్-2 టెన్నిస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల రెండో రౌండ్లోకి ప్రవేశించింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఈ పోటీల్లో సోమవారం జరిగిన మొదటి రౌండ్లో ప్రాంజల 6-4, 6-0తో కొమోల ఉమరోవ (ఉజ్బెకిస్థాన్)పై గెలుపొందింది.
తొలి సెట్లో ప్రాంజలకు కొంత పోటీ ఎదురైనప్పటికీ గెలుపు సాధించగా... రెండో సెట్లో అలవోకగా దూసుకువెళ్లింది. ప్రతిఘటించేందుకు ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఏకపక్ష విజయం సాధించింది. బుధవారం రెండో రౌండ్లో ప్రాంజల బెల్జియంకు చెందిన నైనాతో తలపడనుంది.