విజేత ప్రాంజల 

8 Jul, 2020 00:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆస్ట్రేలియాలో జరుగుతున్న యూటీఆర్‌ ప్రొ టెన్నిస్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల మహిళల సింగిల్స్‌ విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. మెల్‌బోర్న్‌లో జరిగిన ఫైనల్లో 21 ఏళ్ల ప్రాంజల 6–3, 6–3తో డబుల్స్‌లో ప్రపంచ 37వ ర్యాంకర్‌ డెసిరే క్రాజిక్‌ (అమెరికా)పై నెగ్గింది. 78 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ప్రాంజల ఏడు ఏస్‌లు సంధించింది. ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేసి తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయింది.

అంతకుముందు తన గ్రూప్‌లోని లీగ్‌ మ్యాచ్‌ల్లో ప్రాంజల 6–4, 6–3తో స్టెఫీ వెబ్‌ (ఆస్ట్రేలియా)పై, 6–2, 6–3తో అమీ స్టీవెన్స్‌ (ఆస్ట్రేలియా)పై గెలిచి ఫైనల్‌ చేరింది. వెన్ను నొప్పితో ప్రాంజల కొన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉంది. ఫిబ్రవరి నుంచి ఆస్ట్రేలియాలో ఉన్న ప్రాంజల అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) మెడికల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ పాల్‌ నెస్‌ మార్గనిర్దేశంలో చికిత్స తీసుకొని, కోలుకొని మళ్లీ బరిలోకి దిగింది. ‘ఒక టోర్నమెంట్‌ ఆడి మూడు రోజుల్లో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలవడం చాలా సంతోషాన్నిస్తోంది. ఈ సందర్భంగా వ్యక్తిగత కోచ్‌ స్టీఫెన్‌ కూన్, గో స్పోర్ట్స్‌ ఫౌండేషన్, పాల్‌ నెస్‌కు ధన్యవాదాలు చెబుతున్నా’ అని ప్రాంజల వ్యాఖ్యానించింది.

మరిన్ని వార్తలు