ప్రాంజల శుభారంభం

13 Mar, 2018 11:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల శుభారంభం చేసింది. గ్వాలియర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో సింగిల్స్‌ విభాగంలో రెండోరౌండ్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రాంజల 6–4, 6–4తో సారా యాదవ్‌ (భారత్‌)పై విజయం సాధించింది.

మరో మ్యాచ్‌లో హైదరాబాద్‌కే చెందిన సౌజన్య భవిశెట్టి 3–6, 4–6తో కరిన్‌ కెన్నెల్‌ (స్విట్జర్లాండ్‌) చేతిలో ఓటమి పాలైంది. నేడు జరిగే సింగిల్స్‌ తొలిరౌండ్‌ మ్యాచ్‌ల్లో అంకిత రైనాతో రిషిక సుంకర, ఎమిలీ వెబ్లీ స్మిత్‌ (బ్రిటన్‌)తో నిధి చిలుముల తలపడతారు. డబుల్స్‌ తొలిరౌండ్‌లో నటాషా–రిషిక సుంకర (భారత్‌) జంటతో ప్రాంజల (భారత్‌)–కరిన్‌ కెన్నెల్‌ (స్విట్జర్లాండ్‌) జోడీ తలపడుతుంది.

మరిన్ని వార్తలు