సెమీఫైనల్లో ప్రాంజల జోడీ

19 Oct, 2017 10:06 IST|Sakshi

ఐటీఎఫ్‌ మహిళల టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: శ్రీలంకలో జరుగుతున్న అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి యడ్లపల్లి ప్రాంజల సత్తా చాటుకుంది. ఆమె డబుల్స్‌లో సెమీస్‌లోకి, సింగిల్స్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. కొలంబోలో బుధవారం జరిగిన మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో మూడో సీడ్‌ ప్రాంజల–రుతూజా భోసలే జోడి 6–0, 6–0తో ప్రియాంక రాడ్రిక్స్‌ (భారత్‌) గాబ్రియెలా జుర జర్నొవియను (రొమేనియా) జంటపై అలవోక విజయం సాధించింది. తొలి రౌండ్లో భారత జోడీకి ‘బై’ లభించింది. సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన హైదరాబాద్‌ అమ్మాయి 7–6 (7/4), 6–0తో అలైస్‌ గిలాన్‌ (బ్రిటన్‌)పై గెలిచింది. భారత క్రీడాకారిణుల మధ్య జరిగిన పోరులో ఎనిమిదో సీడ్‌ జీల్‌ దేశాయ్‌ 6–0, 6–1తో చామర్తి సాయి సంహితను ఓడించగా... తెలుగు అమ్మాయి రిషిక సుంకర 4–6, 0–6తో యెగ్జిన్‌ మ (చైనా) చేతిలో పరాజయం చవిచూసింది. నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్లో జీల్‌ దేశాయ్‌తో ప్రాంజల తలపడుతుంది. డబుల్స్‌ సెమీస్‌లో ప్రాంజల–రుతూజా జోడీ... టాప్‌ సీడ్‌ ఐనిండినొవా (కజకిస్తాన్‌)–క్యురోవిక్‌ (సెర్బియా) జంటతో తలపడుతుంది. మరో సెమీస్‌లో నాలుగో సీడ్‌ నిధి చిలుముల–ప్రేరణ బాంబ్రీ జోడీ... రెండో సీడ్‌ నటాషా పల్హా–రిషిక సుంకర జంటతో పోటీపడుతుంది.

మరిన్ని వార్తలు