ప్రిక్వార్టర్స్‌లో మనోజ్, మన్‌ప్రీత్

19 Oct, 2013 01:04 IST|Sakshi

అల్మాటీ (కజకిస్థాన్): ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు మనోజ్ కుమార్ (64 కేజీలు), మన్‌ప్రీత్‌సింగ్ (91 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. వీళ్లిద్దరూ తొలి రౌండ్ బైతో నేరుగా శుక్రవారం జరిగిన రెండో రౌండ్ బౌట్‌లో పోటీపడ్డారు.
 
 
  ఇందులో ఆసియా క్రీడల రజత పతక విజేత మన్‌ప్రీత్ 3-0తో సీషెల్స్‌కు చెందిన కెడ్డీ అగ్నెస్‌పై గెలుపొందాడు. మూడు రౌండ్లలోనూ ఆధిపత్యాన్ని చాటిన భారత బాక్సర్ 30-27, 30-27, 30-27తో ప్రత్యర్థిపై విజయం సాధించాడు. మరో పోటీలో మనోజ్ 2-1తో ఫేతీ కెలెస్ (టర్కీ)పై చెమటోడ్చి నెగ్గాడు. కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్, ఆరో సీడ్ మనోజ్ 28-29, 29-28, 29-28తో కెలెస్‌ను మట్టికరిపించాడు.
 
  ప్రిక్వార్టర్స్‌లో 28 ఏళ్ల మన్‌ప్రీత్... ప్రపంచ నంబర్‌వన్ తైముర్ మమదోవ్ (అజార్‌బైజాన్)తో తలపడనుండగా, వెస్ వులైస్ (కెనడా)తో మనోజ్ పోటీపడతాడు. ఈ రెండు మ్యాచ్‌లు సోమవారం జరుగుతాయి. శనివారం జరిగే బౌట్లలో విజేందర్ (75 కేజీలు)... జాసన్ క్విగ్లే (ఐర్లాండ్)తో, నానో సింగ్ (49 కేజీలు)... అఖిల్ అహ్మద్ (స్కాట్లాండ్)తో, 56 కేజీల కేటగిరీలో మరియో ఫెర్నాండెజ్ (ఫిలిప్పీన్స్)తో శివ థాపా, కరిమొవ్ (తజకిస్థాన్)తో సతీష్ (ప్లస్ 91 కేజీలు)  తలపడతారు.
 

మరిన్ని వార్తలు