ముంబై ఓటమిపై ప్రీతి సంబరం.. వైరల్‌!!

21 May, 2018 11:14 IST|Sakshi

అదే ఆనందమో తెలియదు కానీ.. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సహ యజమాని, బాలీవుడ్‌ నటి ప్రీతి జింటా ముందే సంబరపడ్డారు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓడిందని తెలియగానే ఆమె తెగ ఆనందపడిపోయారు. పక్కనే ఉన్న మరో సహ యజమానితో ఆమె మురిసిపోతూ ‘నిజంగా... నాకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి ముంబై ఫైనల్‌కు వెళ్లడం లేదు. నేనైతే హ్యాపీ’ అని ఆమె పేర్కొన్నట్టు వీడియోలో కనిపించింది. ఈ వీడియో క్లిప్‌ ట్విటర్‌లో వైరల్‌ అయింది. కానీ, ఆ తర్వాత చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ప్రితీ జట్టు పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ ఓడిపోయి.. ఇంటిదారి పట్టింది.

ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే చెన్నైని కనీసం 53 పరుగుల తేడాతో ఓడించాల్సిన స్థితిలో బరిలోకి దిగిన పంజాబ్‌ చివరకు పరాభవంతో ఇంటిదారి పట్టింది. ఈ నేపథ్యంలో ముంబై ఓడిపోగానే ప్రితీ సంబరపడటంపై నెటిజన్లు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అదేం ఆనందమోగానీ.. తన జట్టు గెలువకపోయినా పర్వాలేదు.. ముంబై మాత్రం ఓడిపోవడం ఆమెకు ఆనందంగా ఉన్నట్టు ఉందని కామెంట్లు చేస్తున్నారు. ముంబై ఓటమితో పంజాబ్‌ ప్లేఆఫ్‌ చేరితే సంబరపడిందంటే అర్థముంది కానీ.. తమకు ఏమీకాని ఫలితంతో ముందే ఈ సంతోషమేంటని నెటిజన్లు కామెంట్లు చేశారు.

>
మరిన్ని వార్తలు