అహ్మదాబాద్‌కు రెండో విజయం 

27 Dec, 2018 00:28 IST|Sakshi

డబుల్స్‌లో మెరిసిన సిక్కి రెడ్డి, సాత్విక్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)లో అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్‌ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఘనవిజయం సాధించింది. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో బుధవారం జరిగిన పోరులో అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్‌ 4–1తో ఢిల్లీ డాషర్స్‌ను ఓడించింది. ఢిల్లీకిది రెండో పరాజయం. మిక్స్‌డ్‌ డబుల్స్‌తో ఈ పోరు మొదలైంది. తెలంగాణ క్రీడాకారిణి నేలకుర్తి సిక్కి రెడ్డి–ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ (అహ్మదాబాద్‌) జోడీ 15–11, 15–10తో మనిపాంగ్‌ జొంగ్‌జిత్‌–చియ సిన్‌ లీ (ఢిల్లీ) జంటపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌ తొలి మ్యాచ్‌ను ఢిల్లీ ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంచుకుంది. హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 12–15, 13–15తో డారెన్‌ ల్యూ (అహ్మదాబాద్‌) చేతిలో కంగుతినడంతో... ఢిల్లీ(–1)–2కు పడిపోయింది.

పురుషుల సింగిల్స్‌ రెండో మ్యాచ్‌లో ప్రపంచ మాజీ చాంపియన్‌ విక్టర్‌ అక్సెల్‌సన్‌ (అహ్మదాబాద్‌)కు 12–15, 15–10, 8–15తో టామీ సుగియార్తో (ఢిల్లీ) చేతిలో పరాజయం ఎదురైంది. అనంతరం జరిగిన మహిళల సింగిల్స్‌ను ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంచుకున్న అహ్మదాబాద్‌ కిర్‌స్టీ గిల్మోర్‌ను బరిలోకి దించింది. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ గిల్మోర్‌ 12–15, 15–12, 15–7తో ఎవ్‌జినియా కొసెట్స్‌కయా (ఢిల్లీ)పై గెలుపొందింది. చివరగా పురుషుల డబుల్స్‌లో వాంగ్‌ సిజీ–చయ్‌ బియావో (ఢిల్లీ) 15–9, 9–15, 15–13తో లీ చెన్‌ రెగినాల్డ్‌–సాత్విక్‌ సాయిరాజ్‌ (అహ్మదాబాద్‌) జంటపై గెలిచి ఒక పాయింట్‌ను సాధించింది. 

►నేడు జరిగే పోరులో నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌తో ముంబై రాకెట్స్‌ తలపడుతుంది.    

మరిన్ని వార్తలు