మళ్లీ ఓడిన ఢిల్లీ డాషర్స్‌

3 Jan, 2019 00:59 IST|Sakshi

అహ్మదాబాద్‌: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌లో ఢిల్లీ డాషర్స్‌  వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఓడింది.  బుధవారం జరిగిన పోరులో బెంగళూరు రాప్టర్స్‌ 2–1తో ఢిల్లీ డాషర్స్‌పై నెగ్గింది. ముందుగా ఒకరి ట్రంప్‌ మ్యాచ్‌ను మరొకరు గెలవడంతో ఈ పోటీలో రెండు మ్యాచ్‌లు ముగిసినా కూడా స్కోరు 0–0గానే ఉండిపోయింది. ఢిల్లీ ‘ట్రంప్‌’ మ్యాచ్‌లో ప్రణయ్‌ 12–15, 15–14, 13–15తో సాయిప్రణీత్‌ (బెంగళూరు) చేతిలో కంగుతినగా... బెంగళూరు ‘ట్రంప్‌’ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఎలిస్‌–లారెన్‌ స్మిత్‌ జంట 13–15, 9–15తో జొంగ్జిత్‌–కొసెట్‌స్కయా (ఢిల్లీ) ద్వయం ముందు తలవంచింది.

తర్వాత రెండో పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌ (బెంగళూరు) 15–6, 12–15, 15–10తో సుగియార్తో (ఢిల్లీ)పై... మహిళల సింగిల్స్‌లో తి త్రంగ్‌ వు 12–15, 15–3, 15–8తో చియా సిన్‌ లీపై నెగ్గడంతో రాప్టర్స్‌ విజయం ఖాయమైంది. చివరగా జరిగిన పురుషుల డబుల్స్‌లో బియావో–జొంగ్జిత్‌ (ఢిల్లీ)15–7, 11–15, 15–14తో అహ్‌సాన్‌–సెతియవాన్‌ (బెంగళూరు)పై నెగ్గారు.  

మరిన్ని వార్తలు