ధావన్‌ స్థానంలో పృథ్వీ షా

22 Jan, 2020 03:38 IST|Sakshi

న్యూజిలాండ్‌తో వన్డేలకు భారత జట్టు ప్రకటన  

ముంబై: న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో తలపడే భారత జట్టును సెలక్టర్లు మంగళవారం రాత్రి ప్రకటించారు. ఒకే ఒక మార్పు మినహా ఇటీవల ఆ్రస్టేలియాపై సిరీస్‌ గెలుచుకున్న జట్టునే కొనసాగించారు. గాయపడిన శిఖర్‌ ధావన్‌ స్థానంలో ముంబై యువ ఆటగాడు పృథ్వీ షాను ఎంపిక చేశారు. భారత్‌ తరఫున 2 టెస్టులు ఆడిన అనంతరం గాయాలు, డోపింగ్‌ నిషేధంతో పృథ్వీ ఆటకు దూరమయ్యాడు. ఇటీవలే పునరాగమనం చేసిన అతనికి వన్డేల్లో అవకాశం దక్కడం ఇదే మొదటిసారి.

న్యూజిలాండ్‌ ఎలెవన్‌తో ఆదివారం జరిగిన ప్రాక్టీస్‌ వన్డే మ్యాచ్‌లో భారత ‘ఎ’ తరఫున ఆడిన పృథ్వీ షా 100 బంతుల్లోనే 150 పరుగులతో చెలరేగాడు. మరోవైపు టి20లకూ దూరమైన ధావన్‌ స్థానంలో కేరళ వికెట్‌ కీపర్‌ సంజు సామ్సన్‌కు మరో అవకాశం దక్కింది. శ్రీలంకతో సిరీస్‌ అనంతరం జట్టులో స్థానం కోల్పోయిన సంజునే ఇప్పుడు మళ్లీ సెలక్టర్లు ఎంపిక చేశారు. భారత్, న్యూజిలాండ్‌ మధ్య ఫిబ్రవరి 5, 8, 11 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి.

న్యూజిలాండ్‌తో వన్డేలకు భారత జట్టు:
కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, పృథ్వీ షా, రాహుల్, అయ్యర్, పాండే, పంత్, కేదార్‌ జాదవ్, శివమ్‌ దూబే, కుల్దీప్, చహల్, జడేజా, బుమ్రా, షమీ, సైనీ, శార్దుల్‌.   

మరిన్ని వార్తలు