ఆదిలోనే కోహ్లిసేనకు ఎదురుదెబ్బ!

30 Nov, 2018 14:31 IST|Sakshi

ప్రాక్టీస్‌ మ్యాచ్‌ గాయపడ్డ పృథ్వీషా

సిడ్నీ : ఆస్ట్రేలియాతో టెస్ట్‌ సిరీస్‌కు ముందే భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. డిసెంబర్‌ 6 నుంచి ప్రారంభమయ్యే 4 టెస్ట్‌ల సిరీస్‌ సన్నాహకంలో భాగంగా క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఎలెవన్‌తో జరుగుతోన్న నాలుగు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో యువకెరటం, ఓపెనర్‌ పృథ్వీషా గాయపడ్డాడు. సీఏ ఎలెవన్‌ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఓపెనర్‌ మ్యాక్స్‌ బ్రియాంట్‌ క్యాచ్‌ అందుకునే క్రమంలో ఈ ముంబై క్రికెటర్ ఎడమ చీలిమండకు గాయమైంది. అతని ఎడమ మడిమ సుమారు 90 డిగ్రీలు వంగిపోయింది. వెంటనే ఫిజియోలు షాను ఆసుపత్రికి తరిలించి పరీక్షలు జరిపారు. అతని చీలిమండ కీలుకు గాయం అయిందని తేలడంతో పృథ్వీషా తొలి అడిలైడ్‌ టెస్ట్‌ ఆడటం లేదని బీసీసీఐ పేర్కొంది.

ఇక వెస్టిండీస్‌తో అరంగేట్ర టెస్ట్‌లోనే శతకం బాధిన పృథ్వీ షా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఈ ప్రదర్శనతోనే ప్రతిష్టాత్మక ఆసీస్‌ పర్యటనకు ఎంపికయ్యాడు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో సైతం పృథ్వీ షా (69 బంతుల్లో 66; 11 ఫోర్లు) తనదైన శైలిలో చెలరేగాడు. మంచి ఫామ్‌లో ఉన్న పృథ్వీషా ఇలా గాయంతో జట్టుకు దూరం కావడం కోహ్లిసేనకు తీరని లోటే. అసలే టాపర్డర్‌లో ఎవరిని ఆడించాలని తలపట్టుకుంటున్న టీమిండియా మేనేజ్‌మెంట్‌కు పృథ్వీషా గాయం మరింత చిక్కులో పడేసింది. ఇక షా రెండో టెస్ట్‌లోపు అందుబాటులోకి వస్తాడా లేక సిరీస్‌ నుంచి దూరమవుతాడా? అనేది అతని గాయం తీవ్రతపై ఆధారపడి ఉంది. ఒక వేళ షా సిరీస్‌ మొత్తం దూరమైతే.. అతని స్థానంలో శిఖర్‌కు అవకాశం కల్పించవచ్చని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు