పట్నా: ‘డుబ్కీ’ కింగ్ ప్రదీప్ నర్వాల్ చెలరేగినా... ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్లో పట్నా పైరేట్స్ పరాజయం పాలైంది. శనివారం యు ముంబాతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో చివరి వరకు రేసులో నిలిచిన పట్నా ఆఖరకు 39–40తో ఓడింది. పట్నా కెప్టెన్ ప్రదీప్ నర్వాల్ 17 రైడ్ పాయింట్లతో దుమ్మురేపాడు.
ట్యాక్లింగ్లో జైదీప్ (5 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. యు ముంబా తరఫున సిద్ధార్థ్ దేశాయ్ 14, రోహిత్ 11 రైడ్ పాయింట్లతో చెలరేగారు. ట్యాక్లింగ్లో ఫజల్ (6 పాయింట్లు) సత్తాచాటాడు. మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 39–28తో జైపూర్ పింక్ పాంథర్స్పై గెలిచింది. నేటి మ్యాచ్ల్లో దబంగ్ ఢిల్లీతో యూపీ యోధా, పట్నా పైరేట్స్తో హరియాణా స్టీలర్స్ ఆడతాయి.