దుమ్మురేపిన బెంగళూరు బుల్స్

26 Jul, 2015 01:04 IST|Sakshi
దుమ్మురేపిన బెంగళూరు బుల్స్

    పుణేరి పల్టన్‌కు నాలుగో పరాజయం
     {పొ కబడ్డీ లీగ్-2

 
 కోల్‌కతా: మొదట్లో వెనుకబడ్డా... నెమ్మదిగా కోలుకున్న బెంగళూరు బుల్స్ ప్రొ కబడ్డీ లీగ్-2లో మూడో విజయాన్ని సాధించింది. పుణేరి పల్టన్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 31-26తో గెలుపొందింది. పుణేరి పల్టన్ జట్టుకిది నాలుగో పరాజయం కావడం గమనార్హం. విరామ సమయానికి 12-13తో వెనుకంజలో ఉన్న బెంగళూరు జట్టును కెప్టెన్ మంజిత్ చిల్లర్ తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆదుకున్నాడు. రైడింగ్‌లోనూ, క్యాచింగ్‌లోనూ ఆకట్టుకున్న మంజిత్ ఐదు పాయింట్లు సంపాదించాడు. మరో ప్లేయర్ ఆశిష్ ఏడు పాయింట్లు, రాజేశ్ మండల్ నాలుగు పాయింట్లు స్కోరు చేసి బెంగళూరు విజయాన్ని ఖాయం చేశారు. ఆరంభంలో వజీర్ సింగ్, తుషార్ పాటిల్ రాణింపుతో పుణేరి ఒకదశలో 10-4తో ఆధిక్యంలోకి వెళ్లింది.

కానీ బెంగళూరు ఆటగాళ్లు పట్టుదలతో పోరాడి నిలకడగా పాయింట్లు సాధించి స్కోరును సమం చేశారు. రెండో అర్ధభాగంలో బెంగళూరు ఆటగాళ్లు జోరు పెంచగా... పుణేరీ జట్టు డీలా పడింది. ఒకదశలో పుణేరి ఆటగాళ్లు రైడింగ్ వెళ్లినా ఖాళీ చేతులతో తిరిగి రావడం కనిపించింది. మరోవైపు బెంగళూరు ఆటగాళ్లు రైడింగ్‌కు వెళ్లిన ప్రతిసారీ పాయింట్ సాధిస్తూ వచ్చారు. మరో మ్యాచ్‌లో ఢిల్లీ దబాంగ్ 32-21తో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. ఢిల్లీ తరఫున రవీందర్ పహల్ ఏడు పాయింట్లు స్కోరు చేయగా... కాశిలింగ్ అడకె, రోహిత్ కుమార్ చౌదరీ ఆరేసి పాయింట్లు సాధించి తమ జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించారు.
 
 ప్రొ కబడ్డీ లీగ్‌లో నేడు
 జైపూర్ పింక్ పాంథర్స్ +  పాట్నా పైరేట్స్
 రాత్రి గం. 8.00 నుంచి
 తెలుగు టైటాన్స్ + యు ముంబా
 రాత్రి గం. 9.00 నుంచి
 స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం

మరిన్ని వార్తలు