పట్నా: ప్రొ కబడ్డీ లీగ్లో పట్నా పైరేట్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఆ జట్టు 35-21తో బెంగాల్ వారియర్స్పై గెలిచింది. దీంతో వరుసగా ఐదో విజయంతో 25 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో టాప్లో నిలిచింది. సూపర్ రైడింగ్తో చెలరేగిన పట్నా ఆటగాడు ప్రదీప్ నర్వాల్ 10 పాయింట్లు సాధించాడు. రాజేశ్ మోండల్ (5) ఫర్వాలేదనిపించాడు. అయితే ట్యాక్లింగ్లో అద్భుత నైపుణ్యం చూపెట్టిన ధర్మరాజు 9 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫజెల్ మూడు పాయింట్లతో సహకారం అందించాడు. రైడింగ్లో విఫలమైన వారియర్స్ తొలి అర్ధభాగానికే వెనుకబడింది.
నితిన్ (7), విశాల్ (4), మోను (3) రాణించినా ప్రయోజనం లేకపోయింది. ఓవరాల్గా మ్యాచ్ మొత్తంలో పట్నా రైడింగ్లో 17, ట్యాక్లింగ్లో 15 పాయింట్లు గెలిస్తే... బెంగాల్ 13, 8 పాయింట్లతోనే సరిపెట్టుకుంది. పట్నాకు రెండు ఆలౌట్ పాయింట్లు కూడా లభించాయి. మరో మ్యాచ్లో యు ముంబా 24-23తో బెంగళూరు బుల్స్పై నెగ్గింది. ప్రస్తుతం యు ముంబా 22 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. యు ముంబా కెప్టెన్ అనుప్ కుమార్ 11 పాయింట్లతో చెలరేగాడు. రాకేశ్, సునీల్ చెరో మూడు పాయింట్లతో రాణించారు. శనివారం జరిగే మ్యాచ్ల్లో బెంగాల్ వారియర్స్తో పుణెరి పల్టన్; పట్నా పైరేట్స్తో ఢిల్లీ దబంగ్ తలపడతాయి.