తెలుగు టైటాన్స్ బోణీ

20 Jul, 2015 00:18 IST|Sakshi
తెలుగు టైటాన్స్ బోణీ

 దబాంగ్ ఢిల్లీపై విజయం  ఠ ప్రొ కబడ్డీ లీగ్-2
 ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) రెండో సీజన్‌లో తెలుగు టైటాన్స్ జట్టు అదరగొట్టింది. ఆదివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ జట్టుపై 36-27 తేడాతో ఘన విజయం సాధించింది. ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ తరఫున మెరాజ్ షేక్ ఎనిమిది, దీపక్ నివాస్ ఏడు రైడింగ్ పాయింట్లు సాధించారు. రాహుల్ చౌదరి ఐదు పాయింట్లతో ఆకట్టుకున్నాడు. మ్యాచ్ ఆరంభం నుంచి టైటాన్స్ ఆటగాళ్ల అద్భుత రైడింగ్‌తో ఢిల్లీకి వణుకు పుట్టించారు. ప్రారంభంలోనే 6-2తో దూసుకెళ్లిన టైటాన్స్ తొలి అర్ధభాగం ముగిసే సరికి 18-8 పాయింట్లతో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. నాలుగుసార్లు ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది. రైడింగ్ ద్వారానే తెలుగు టైటాన్స్ 21 పాయింట్లు అందుకుంది.
 
 ముంబాకి రెండో గెలుపు
 జోరు మీదున్న యు ముంబా జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. బెంగళూరు బుల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 36-23 తేడాతో సునాయాసంగా నెగ్గింది. షబీర్ బాపు పది రైడింగ్ పాయింట్లు సాధించాడు. గతేడాది రన్నరప్‌తో సరిపెట్టుకున్న యు ముంబా జట్టు ప్రస్తుతం 10 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.  సోమవారం జరిగే లీగ్ మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో తెలుగు టైటాన్స్; పాట్నా పైరేట్స్‌తో యు ముంబా తలపడతాయి. ఈ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
 

మరిన్ని వార్తలు