ఓవైపు నాన్నకు ఆపరేషన్‌.. మరోవైపు బ్యాటింగ్‌

2 Feb, 2019 09:12 IST|Sakshi
తండ్రితో పుజారా

రాజ్‌కోట్‌ : గత నెలలలో ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుని టీమిండియా చరిత్ర సృష్టించింది. తన టెస్టు క్రికెట్‌ చరిత్రలో తొలిసారి ఆస్ట్రేలియాలో సిరీస్‌ గెలిచి 72 ఏళ్ల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకుంది. అద్వితీయ ఆటతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన క్లాసిక్‌ ఓపెనర్‌ చతేశ్వర్‌ పుజారా మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు. ఇక చివరిదైన నాలుగో టెస్టులో పుజారా 193 పరుగులు చేసి తృటిలో డబుల్‌ సెంచరీ చేసే అవకాశం కోల్పోయిన సంగతి తెలిసిందే. అటు అభిమానులు, ఇటు పుజారా ద్విశతకానికి ఏడు పరుగుల దూరంలో అవుటవ్వడంతో నిరాశచెందారు. మనందరికీ తెలియని ఇంకో విషయమేమిటంటే.. పుజారా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో (టెస్టు మొదటి రోజు) అతని తండ్రి అరవింద్‌ ఆస్పత్రిలో ఉన్నాడు.  ఓవైపు తండ్రికి హార్ట్‌ సర్జరీ కొనసాగుతుండగానే.. పుజారా తన ఆటను కొనసాగించాడు. జట్టుకు భారీ స్కోరునందించి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు. (పుజారా డబుల్‌ సెంచరీ మిస్‌)

‘నాన్నకు ఆపరేషన్‌ జరగుతుండడంతో కొంత ఆందోళన చెందాను. కానీ, ఆయనకేం పరవాలేదు. ఆపరేషన్‌ సక్సెస్‌ అవుంతుందని డాక్టర్లు భరోసా ఇచ్చారు. దాంతో కొంత ధైర్యం వచ్చింది. అప్పటికే గత మ్యాచ్‌లలో పరుగులు సాధించడం. సిడ్నీ మైదానంలో ప్రాక్టిస్‌ చేసి ఉండడం కలిసొచ్చింది. దాంతో ఆటపై దృష్టిపెట్టాను. దేవుడి దయవల్ల నాన్న కోలుకున్నారు’అని పుజారా తన సిడ్నీ టెస్టు అనుభవాలను పంచుకున్నారు. 

‘ఆపరేషన్‌కు ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు నాన్న మా ఆట చూశారు. నా ఆటచూసి హ్యాపీగా ఫీలయ్యారు. అక్కడి డాక్టర్లు కంగ్రాట్స్‌ కూడా చెప్పారు. అయితే, 7 పరుగులతో డబుల్‌ సెంచరీ మిస్‌ కావడంపై.. నాన్న స్పందిస్తూ.. మరేం పరవాలేదు. డబుల్‌ సెంచరీ అనేది ఒక నెంబర్‌ మాత్రమే. జట్టుకు మంచి స్కోరు అందించావ్‌. బాధపడొద్దు’ అని తనకు మరింత ధైర్యం ఇచ్చారని పుజారా చెప్పుకొచ్చారు. మొత్తంగా ఈ బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో పుజారా ఏకంగా 30 గంటలకు పైగా బ్యాంటింగ్‌ చేసి 1258 బంతులు ఎదుర్కొన్నాడు. ఏడు ఇన్నింగ్స్‌లలో 521 పరుగులు చేశాడు. ఫ్రాంచైజీల ట్రెండ్‌తో.. నోట్ల వర్షమే పరమావధిగా సాగుతున్న టీ20ల కాలంలో.. నిజంగా పుజారా ఆట వెరీ క్లాసిక్‌ కదా..!!

>
మరిన్ని వార్తలు