పీబీఎల్‌లో పుణే బోణీ

26 Jan, 2020 02:26 IST|Sakshi

లక్నో: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) సీజన్‌–5లో పుణే సెవెన్‌ ఏసెస్‌ జట్టు బోణీ కొట్టింది. శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో పుణే 5–2తో ముంబై రాకెట్స్‌పై గెలిచింది. తొలుత జరిగిన పరుషుల డబుల్స్‌ పోరులో చిరాగ్‌ శెట్టి–హెండ్రా సెటియావన్‌ (పుణే) ద్వయం 14–15, 15–5, 15–6తో కిమ్‌ జుంగ్‌– కిమ్‌ స రంగ్‌ (ముంబై) జంటపై గెలిచింది. అనంతరం జరిగిన మహిళల సింగిల్స్‌లో ‘ట్రంప్‌ కార్డు’తో బరిలో దిగిన పుణే ప్లేయర్‌ రితుపర్ణ దాస్‌ 11–15, 15–9, 15–9తో శ్రేయాన్షి పర్దేశి (ముంబై)పై గెలవడంతో... పుణే 3–0తో ఆధిక్యంలో నిలిచింది.

తర్వాత జరిగిన పురుషుల మొదటి సింగిల్స్‌లో లోహ్‌ కియాన్‌ య్యూ (పుణే) 15–7, 15–14తో పారుపల్లి కశ్యప్‌ (ముంబై)పై నెగ్గడంతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే పుణే విజయాన్ని ఖాయం చేసుకుంది. ఇక నామమాత్రంగా జరిగిన పురుషుల రెండో సింగిల్స్‌ మ్యాచ్‌లో సకాయ్‌ (పుణే) 7–15, 13–15తో లీ డాంగ్‌ కెయున్‌ (ముంబై) చేతిలో ఓడాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ‘ట్రంప్‌ కార్డు’తో ఆడటంతో... ఆ జట్టుకు రెండు పాయింట్లు లభించాయి. చివరి మ్యాచ్‌ అయిన మిక్స్‌డ్‌ డబుల్స్‌లో క్రిస్‌–గ్యాబీ (పుణే) ద్వయం 15–12, 10–15, 15–6తో కిమ్‌ జి జుంగ్‌–పియా జెబిదియా (ముంబై) జంటపై గెలిచింది. నేటి మ్యాచ్‌లో అవధ్‌ వారియర్స్‌తో హైదరాబాద్‌ హంటర్స్‌ తలపడుతుంది.

>
మరిన్ని వార్తలు