టైటాన్స్‌ మరో ఓటమి

22 Dec, 2018 00:55 IST|Sakshi

కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌ వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడి క్వాలిఫయింగ్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. జోన్‌ ‘బి’లో భాగంగా శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్‌ 20–35తో పుణేరి పల్టన్‌ చేతిలో ఓడింది. ట్యాక్లింగ్‌లో సత్తా చాటిన పుణేరి పల్టన్‌ విజయం సాధించింది. స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరి పూర్తిగా విఫలమవడంతో టైటాన్స్‌కు ఓటమి తప్పలేదు. 12 రైడ్లు చేసిన అతను కేవలం ఒక్క పాయింట్‌ మాత్రమే సాధించాడు.
 

రైడింగ్‌తో పాటు ట్యాక్లింగ్‌లో అదరగొట్టిన పల్టన్‌ సునాయాసంగా గెలుపొందింది. పల్టన్‌ తరఫున జీబీ మోరే 10 పాయింట్లతో మెరవగా... రవికుమార్, రింకూ నర్వాల్‌ చెరో 5 పాయింట్లు సాధించారు. టైటాన్స్‌ తరఫున ఫర్హద్‌ 5, నీలేశ్‌ 3 పాయింట్లు చేశారు. మరో మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ 27–24తో తమిళ్‌ తలైవాస్‌పై గెలిచింది. నేటి మ్యాచ్‌ల్లో యూ ముంబాతో యూపీ యోధా, బెంగాల్‌ వారియర్స్‌తో పట్నా పైరేట్స్‌ తలపడతాయి. 

మరిన్ని వార్తలు