హంటర్స్‌కే సింధు

27 Nov, 2019 05:00 IST|Sakshi

రూ. 77 లక్షలకు సొంతం చేసుకున్న హైదరాబాద్‌ హంటర్స్‌

తై జు యింగ్‌కు అంతే మొత్తం చెల్లించనున్న

బెంగళూరు రాప్టర్స్‌

సాత్విక్‌ సాయిరాజ్‌కు రూ. 62 లక్షలు

ముగిసిన పీబీఎల్‌–5 వేలం

ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ వేలంలో మరోసారి ఇద్దరు అగ్రశ్రేణి షట్లర్ల హవా కొనసాగింది. పీవీ సింధు, తై జు యింగ్‌లను లీగ్‌ అనుమతించిన గరిష్ట మొత్తం రూ. 77 లక్షలకు వరుసగా హైదరాబాద్‌ హంటర్స్, బెంగళూరు రాప్టర్స్‌ జట్లు సొంతం చేసుకున్నాయి. ఐదో సీజన్‌ కోసం మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన వేలంలో మొత్తం 154 మంది షట్లర్లు పాల్గొన్నారు. ఏడు జట్లు ఒక్కో ఆటగాడిని కొనసాగించాయి.

వేలానికి ముందే ఇద్దరు స్టార్లు సైనా నెహా్వల్, కిడాంబి శ్రీకాంత్‌ టోరీ్నకి దూరం కాగా... రెండు జట్లు ఢిల్లీ డాషర్స్, అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్‌ కూడా ఆరి్థకపరమైన కారణాలతో పీబీఎల్‌ నుంచి తప్పుకోవడంతో లీగ్‌ 9 జట్ల నుంచి 7కు తగ్గింది. చెన్నై స్మాషర్స్‌ జట్టు పేరు మార్చుకొని ఈసారి చెన్నై సూపర్‌స్టార్స్‌గా బరిలోకి దిగనుంది.   

న్యూఢిల్లీ: వరల్డ్‌ చాంపియన్‌ పూసర్ల వెంకట (పీవీ) సింధు ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)లో మరోసారి సొంత జట్టుకే ప్రాతినిధ్యం వహించనుంది. మంగళవారం జరిగిన వేలంలో హైదరాబాద్‌ హంటర్స్‌ రూ. 77 లక్షలతో సింధును కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. పీబీఎల్‌ నిబంధనల ప్రకారం గత ఏడాది ఒక ప్లేయర్‌కు గరిష్టంగా రూ. 70 లక్షలు చెల్లించారు. సింధుకు కూడా అదే మొత్తం దక్కింది. ఈ ఏడాది వారిని కొనసాగించాలంటే రూ. 70 లక్షలు గానీ లేదంటే అదనంగా 10 శాతం మించకుండా ఇవ్వవచ్చు.

దాంతో హంటర్స్‌ రూ. 77 లక్షలతో సింధును సొంతం చేసుకుంది. వరల్డ్‌ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)కి కూడా వేలంలో రూ. 77 లక్షలు దక్కాయి. గత సీజన్‌లో తై జు యింగ్‌ అహ్మదాబాద్‌ టీమ్‌కు ఆడింది. అయితే ఈసారి ఆ జట్టు లేకపోవడంతో వేలంలో పాల్గొనాల్సి వచ్చింది. కనీస విలువ రూ. 70 లక్షలతోనే తై జు వేలం ప్రారంభమైంది. బెంగళూరు, పుణే ఆమె కోసం పోటీపడి రూ. 77 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. దాంతో నిబంధనల ప్రకారం ‘డ్రా’ తీశారు. ఇందులో ఆమె డిఫెండింగ్‌ చాంపియన్‌ బెంగళూరు రాప్టర్స్‌ జట్టుకు ఎంపికైంది. ఇటీవల అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న డబుల్స్‌ స్పెషలిస్ట్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ వేలం ఆసక్తికరంగా సాగింది.

కనీస ధర రూ. 25 లక్షలతో అతని వేలం మొదలు కాగా... హైదరాబాద్, అవ«ద్‌లతో పోటీ పడి చివరకు రూ. 62 లక్షలకు చెన్నై సొంతం చేసుకుంది. వరల్డ్‌ చాంపియన్‌íÙప్‌ కాంస్య పతక విజేత భమిడిపాటి సాయిప్రణీత్‌ను రూ. 32 లక్షలకు బెంగళూరు అట్టి పెట్టుకుంది. వేలంలో చెప్పుకోదగ్గ విలువ పలికిన కీలక ఆటగాళ్లలో పారుపల్లి కశ్యప్‌ (రూ. 43 లక్షలు–ముంబై), సౌరభ్‌ వర్మ (రూ. 41 లక్షలు–హైదరాబాద్‌) ఉన్నారు. యువ సంచలనం లక్ష్య సేన్‌ను చెన్నై రూ. 36 లక్షలకు తీసుకుంది.

స్టార్స్‌ దూరం...
గత సీజన్‌లో ఆడిన ప్రపంచ మాజీ చాంపియన్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌), ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచిన ఆంటోన్సెన్‌ (డెన్మార్క్‌), రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) ఈసారి బరిలోకి దిగడం లేదు. భారత అగ్రశ్రేణి క్రీడాకారులు సైనా, శ్రీకాంత్, సమీర్‌ వర్మ, ప్రణయ్‌ కూడా ఆడటంలేదు. వేలంలో పేరు నమోదు చేసుకున్నా భారత డబుల్స్‌ స్పెషలిస్ట్‌ అశ్విని పొన్నప్పను ఏ జట్టూ తీసుకోలేదు.  


►10 పీబీఎల్‌–5లో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఉన్న క్రీడాకారుల సంఖ్య. సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్, సుమీత్‌ రెడ్డి, పుల్లెల గాయత్రి, రుత్విక శివాని, సిక్కి రెడ్డి, రితూపర్ణ దాస్‌ (తెలంగాణ); పీవీ సింధు, సాత్విక్‌ సాయిరాజ్, గారగ కృష్ణ ప్రసాద్‌ (ఆంధ్రప్రదేశ్‌). 


 

మరిన్ని వార్తలు