సింధు గెలిపించింది 

7 Jan, 2018 01:41 IST|Sakshi

రెండు మ్యాచుల్లో నెగ్గిన తెలుగుతేజం

సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌కు షాక్‌

చెన్నై: సింగిల్స్‌తో పాటు నిర్ణాయక మిక్స్‌డ్‌ డబుల్స్‌ పోరులోనూ చెమటోడ్చిన సింధు చెన్నై స్మాషర్స్‌ను గెలిపించింది. దీంతో ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌–3)లో చెన్నై రెండో విజయం సాధించింది. సొంతగడ్డపై శనివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 2–1తో అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్‌పై గెలిచింది. పురుషుల డబుల్స్‌లో క్రిస్‌ అడ్‌కాక్‌–యంగ్‌ లీ (చెన్నై) 13–15, 12–15తో లీ చన్‌ హీ–నందగోపాల్‌ (అహ్మదాబాద్‌) చేతిలో ఓడగా, మహిళల సింగిల్స్‌లో సింధు 15–11, 10–15, 15–12తో ప్రపంచ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ (అహ్మదాబాద్‌)పై గెలిచింది.

చెన్నై పురుషుల సింగిల్స్‌ ‘ట్రంప్‌’ మ్యాచ్‌లో లెవెర్‌డెజ్‌ 15–12, 14–15, 12–15తో సౌరభ్‌ వర్మ చేతిలో కంగుతిన్నాడు. మరో సింగిల్స్‌ అహ్మదాబాద్‌కు ‘ట్రంప్‌’ కాగా... తనోంగ్సక్‌ (చెన్నై) 15–10, 12–15, 15–14తో ప్రణయ్‌పై గెలుపొందాడు. స్కోరు 1–1తో సమంగా నిలిచిన ఈ దశలో సుమిత్‌ రెడ్డితో కలిసి సింధు మిక్స్‌డ్‌ డబుల్స్‌లో అమీతుమీకి సిద్ధమైంది. ఇందులో చెన్నై జోడీ 15–14, 15–13తో లీ చన్‌ హీ–కమిల్లా రైటర్‌ జంటను ఓడించి జట్టును గెలిపించింది. నేడు జరిగే పోరులో హైదరాబాద్‌ హంటర్స్‌తో అవధ్‌ వారియర్స్‌ తలపడుతుంది.   

మరిన్ని వార్తలు