సింధు సంచలనం

16 Aug, 2016 14:44 IST|Sakshi
సింధు సంచలనం

రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్లో భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు సంచలన విజయం సాధించింది. మహిళల సింగిల్స్ విభాగంలో తన కంటే ఎంతో మెరుగైన ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్, చైనీస్ తైపీ క్రీడాకారిణి తాయ్ ఝు యింగ్పై సింధు గెలిచి క్వార్టర్స్లోకి ప్రవేశించింది. భారత  కాలమాన ప్రకారం మంగళవారం తెల్లవారుజామున జరిగిన పోరులో సింధు 21-13, 21-15 తేడాతో ఝు యింగ్ ఓడించి క్వార్టర్స్ కు చేరింది.

ఈ మ్యాచ్కు ముందు వరకూ వీరిద్దరి ముఖాముఖి పోరులో యింగ్ 4-2తో ముందంజంలో ఉంది. దీంతో యింగ్ నే మ్యాచ్ ఫేవరెట్గా పరిగణించగా, సింధు మాత్రం అంచనాలను తారుమారు చేస్తూ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆద్యంతం దూకుడును కనబరిచిన సింధు.. తొలి గేమ్ను అవలీలగా గెలుచుకుంది. అయితే రెండో గేమ్లో యింగ్ నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా చివరకు సింధునే పైచేయి సాధించింది. వరుస రెండు గేమ్ల్లో ఏకపక్ష విజయం సాధించిన సింధు పదునైన స్మాష్లతో అలరించి నాకౌట్ పోరుకు సిద్ధమైంది. దీంతో క్వార్టర్స్ లో చైనా క్రీడాకారిణి, ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ యిహాన్తో సింధు అమీతుమీ తేల్చుకోనుంది. అంతకుముందు కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్స్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు